కోల్కతా మే 8
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మరోసారి కేంద్ర ప్రభుత్వంపైన, కేంద్ర ఎన్నికల సంఘంపైన తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆమె.. పారదర్శకంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరిస్తున్నదని మమత మండిపడ్డారు. కేంద్రం చెప్పినట్టల్లా ఈసీ తోకాడించడం కరెక్టు కాదని, ఇకపై ఇలా జరుగకుండా కేంద్ర ఎన్నికల సంఘంలో తక్షణ సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉన్నదని ఆమె వ్యాఖ్యానించారు.
ఇక బెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం చోటుచేసుకున్న హింసపై కేంద్రం నిజనిర్ధారణ కమిటీ వేయడం, గవర్నర్ను నివేదిక కోరడం లాంటి ఘటనలపై కూడా మమత ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి 24 గంటలైనా గడువకముందే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమపై కక్ష్యపూరిత చర్యలకు పూనుకున్నదని ఆమె విమర్శించారు. బెంగాల్ ప్రజల తీర్పును బీజేపీ నేతలు భరించలేక పోతున్నారని మమత ఎద్దేవా చేశారు.
బెంగాల్కు వెన్నెముక ఉన్నదని, ఇక్కడ ప్రజలు ఎవరికీ లొంగరని మమతా బెనర్జి వ్యాఖ్యానించారు. బీజేపీ, ఎన్నికల సంఘం, కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి అంతా బెంగాల్లో తిష్టవేసి కుట్ర చేసినా వారికి ఓటమి తప్పలేదని అన్నారు. తనను ఓడించడం కోసం వారు విమానాలకు, హోటళ్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, రాష్ట్రంలో డబ్బును వరదలా పారించారని, అయినా వాళ్ల పాచికలు పారలేదని మమత చెప్పారు.