హైదరాబాద్
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చెందిన సాక్షి టీవీ రిపోర్టర్ చెలుకుల వెంకట్ రెడ్డి కరోనా తో మృతి చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజెస్తున్నాను. ఇప్పటివరకు తెలంగాణాలో 100 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దేశం మొత్తంలో దాదాపు పదిహేను రాష్ట్రాలలో జర్నలిస్టులను "ఫ్రంట్ లైన్ వారియర్స్ " గా గుర్తించారు. వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం రాష్ట్ర ప్రభుత్వాలు చేయిస్తున్నాయి. కరోనా తో చనిపోయిన జర్నలిస్టులకు ఐదు లక్షల రూపాయలు నష్ట పరిహారం కూడా చెల్లిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా తక్షణమే జర్నలిస్టులను " ఫ్రంట్ లైన్ వారియర్స్ " గా గుర్తించాలి . వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం తెలంగాణ ప్రభుత్వం చేయించాలి . నిత్యం ప్రజల కోసం పని చేసే జర్నలిస్టులు కరోనాతో చనిపోతే ఐదు లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కి విజ్ఞప్తి చేసారు.