ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నిన్న ప్లీనరిలో సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన శనివారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు ఘనత కాంగ్రెస్దేనని అన్నారు. కాంగ్రెస్ వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. కేసీఆర్ చిల్లర రాజకీయాలకే పరిమితమవుతున్నారని, తమపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమని ఆయన అన్నారు. తాను 16ఏళ్ల వయసులో ప్రాణాలు లెక్కచేయకుండా సైన్యంలో చేరానని, ప్రజాసేవ చేయడానికి నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చానని ఉత్తమ్ స్పష్టం చేశారు. తను, తన భార్య ప్రజాసేవకే అంకితమయ్యామని ఆయన అన్నారు. కేసీఆర్లా దొంగతెలివితేటలు తమకు లేవన్నారు.కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోపిడీ చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రగతిభవన్లో150 గదులున్నాయని తాను అనలేదన్నారు. ఎవడబ్బ సొమ్మని రూ.500 కోట్లు విలువచేసే భూమిలో... రూ.60కోట్లు వెచ్చించి ప్రగతి భవన్ కట్టారని ఉత్తమ్ ప్రశ్నించారు. కేసీఆర్ అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆయన విమర్శించారు. ప్రగతిభవన్ కేసీఆర్ జాగీరు కాదని, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఎదుటివారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం దురదృష్టకరమని చెప్పారు.. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కేసీఆర్... ఆయన మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని విమర్శించారు. ప్రధాని ఇల్లు కూడా ప్రగతిభవన్లా ఉండదని ఉత్తమ్ విమర్శించారు.