న్యూఢిల్లీ మే 10
కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ తీరుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మండిపడ్డారు. 180 జిల్లాల్లో కరోనా తగ్గుముఖం పట్టిందని, తాజా కేసులేవీ నమోదు కాలేదని ఆయన చెప్పడం విచారకరమని అన్నారు. ఆయన మరోలోకంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్నవారికి ఎస్సెమ్మెస్లు పంపినట్టు మంత్రి గొప్పలు చెప్పుకున్నారని, ఎస్సెమ్మెస్లు పంపితే కరోనా నియంత్రణలోకి వచ్చినట్టా? అని థరూర్ నిలదీశారు. మరోవైపు కేంద్రం దగ్గర బడ్జెట్ లో మంజూరైన 35 వేల కోట్ల నిధులుంటే వ్యాక్సిన్ ఖర్చు రాష్ట్రాలు భరించాలనడం సబబు కాదని కాంగ్రెస్ ఎంపీ ట్విట్టర్లో పేర్కొన్నారు. పతంజలి సంస్థ తయారు చేసిన కరోనిల్ ఔషధాన్ని ఆరోగ్యమంత్రి ప్రమోట్ చేయడంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వివరణ అడగడాన్ని ప్రస్తావిస్తూ, మంత్రి సమాధానం వినాలని ఉంది అని థరూర్ తెలిపారు.