న్యూఢిల్లీ మే 10
ఇండియాలో వ్యాక్సిన్ల ధరలు, కొరత, నెమ్మదిగా సాగుతున్న ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. తమ వ్యాక్సినేషన్ విధానాన్ని సమర్థించుకున్న ప్రభుత్వం.. ఈ విషయంలో న్యాయవ్యవస్థ జోక్యం అనసవరం అని చెప్పడం గమనార్హం. వ్యాక్సిన్లపై నిర్ణయాలను మాకు వదిలేయండి. ఈ నిర్ణయాన్ని ప్రజల ప్రయోజనార్థం మెడికల్, సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ సూచనల మేరకు తీసుకున్నామని స్పష్టం చేసింది. ఆదివారం అర్ధరాత్రి వేళ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. సోమవారం దీనిపై కోర్టు విచారణ జరపనుంది. వ్యాక్సిన్ల ధరలను మరోసారి పరిశీలించాలని గతవారం కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ఈ విషయంలో మాత్రం కోర్టు జోక్యం వద్దని కేంద్రం వాదిస్తోంది. అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు, చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నాం. ఇందులో న్యాయ వ్యవస్థ జోక్యం అనవసరం. ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పాలకులకే ఈ నిర్ణయాన్ని వదిలేయండి అని తన అఫిడవిట్లో కేంద్రం స్పష్టం చేసింది.