హైదరాబాద్ మే 10
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ బయ్యారపు ప్రసాదరావు మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.కొన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్న ప్రసాదరావుకు నిన్న రాత్రి ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను దవాఖానకు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రసాదరావు మృతిచెందారు.ప్రసాదరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ. 1979వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల ఎస్పీగా పనిచేశారు. అనంతరం ఏసీబీ డీజీగా, విశాఖ ఎస్పీ, హైదరాబాద్ కమిషనర్గా, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగానూ సేవలందించారు. ఆయన సేవలకుగాను 1997లో భారత పోలీస్ పతకం, 2006లో రాష్ట్రపతి పోలీసు పతకాలను అందుకున్నారు. డీజీపీ వి.దినేశ్ రెడ్డి తర్వాత 30 సెప్టెంబరు 2013లో ఇన్చార్జ్ డీజీపీగా ఆయన వ్యవహరించారు. ఆయన వర్డ్ పవర్ టు మైండ్ పవర్ అనే పుస్తకం రాశారు.