న్యూఢిల్లీ మే 10
కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికకు ముహుర్తం ఖరారైంది. గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న సస్పెన్షన్కు త్వరలోనే తెరపడనుంది. అధ్యక్షుడు ఎవరు అనేది జూన్లో తేలనుంది. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికను జూన్ 23న నిర్వహించాలని ఆ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు ఉండాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిచింది.కాగా, 2019లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఓటమిపాలవ్వడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు. అయితే, తాత్కాలిక పదవి కాకుండా శాశ్వతంగా అధ్యక్షుడిని ఎంపిక చేయాలని పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. దీంతో.. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సిద్ధమైంది ఏఐసీసీ.