న్యూఢిల్లీ మే 10
పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పేలవమైన ఫలితాలు సాధించడం పట్ల పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరుత్సాహపూరితమైన ఈ ఫలితాలతో మన లోటుపాట్లను గుర్తెరగాలని సోమవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో మాట్లాడుతూ పేర్కొన్నారు. కేరళ, అసోం రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రభుత్వాలను కాంగ్రెస్ ఎందుకు గద్దె దింపలేకపోయిందో సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు.పశ్చిమ బెంగాల్లో పార్టీ ఎందుకు తుడిచిపెట్టుకుపోయిందో ఆత్మ పరిశీలన సాగించాలని అన్నారు. పార్టీలో నిస్తేజం నింపే ఈ ఫలితాలను వాస్తవిక కోణంలో మనం చూడనిపక్షంలో వీటి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేమని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతుండటం పట్ల నరేంద్ర మోదీ సర్కార్ లక్ష్యంగా సోనియా విమర్శలు గుప్పించారు. శాస్త్రవేత్తల సలహాలను పెడచెవిన పెట్టడంతో భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి వ్యాప్తికి కారకాలుగా మారేలా పెద్దసంఖ్యంలో ప్రజలు గుమికూడే కార్యక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహించిందని ఆరోపించారు.