న్యూ ఢిల్లీ మే 11
భారతీయులకు ఇమ్యూనిటీ ఎక్కువని, మనకసలు కరోనా రాదని, ఎన్ని వేరియంట్లు వచ్చినా మనల్ని ఏమీ చేయలేవని, ఇంతకాలం చాలా మంది భరోసాతో ఉన్నారు. కానీ ఆ భరోసా ఒక్కసారిగా పటాపంచలైపోయింది. మనకళ్లముందే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్ దొరక్క. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకక ఆర్తనాదాలు పెడుతున్నారు. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నా.. దేశంలో ఎన్నికలు నిర్వహించారు. దీంతో కరోనా మరింత ఉధృతమైంది. ప్రస్తుతం ప్రాణాలను హరిస్తున్నది.అయితే తాజాగా ఐఐఎస్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్) చేసిన ఓ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పలు షాకింగ్ నిజాలు బయటపెట్టింది. రానున్న రోజులు మరింత ప్రమాదకరమపని ఐఐఎస్ తేల్చి చెప్పింది. బెంగళూరులో సుమారు 14 వేల మంది చనిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. ఐఐఎస్ అంచనాతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కొన్ని సంస్థలు మే నెలాఖరుకు కరోనా తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పాయి. అయితే తాజాగా బయటకొచ్చిన అధ్యయనం మాత్రం అందుకు విరుద్ధంగా కరోనా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పడం గమనార్హం.ఐఐఎస్ నివేదిక ప్రకారం.. ఈ నెల 17 నాటికి బెంగళూరులో కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. జూన్ 11 నాటికి బెంగళూరులో 14 వేల మంది చనిపోయే అవకాశ ఉంది. రోజుకు కనీసంలో కనీసంగా 466 మంది చనిపోవడం ఖాయమని స్పష్టమవుతోంది. అయితే కరోనాతో ఇంతమంది చనిపోతారని ఓ ప్రముఖ సంస్థ అంచనా వేయడంతో అందరిలోనూ భయం నెలకొన్నది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి బాగానే ఉంది కానీ ఒక్క ఇండియాలో మాత్రమే పరిస్థితి చేయి దాటిపోయిందని డబ్ల్యూహెచ్వో కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. శ్రీలంక లాంటి దేశాలు కూడా భారత్ తో రాకపోకలను నిలిపివేశాయి. ప్రస్తుతం మనదేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది.