అమరావతి మే 11
తిరుపతి రుయా ఆసుపత్రి లో ఆక్సిజన్ అందక 10 మందికిపైగా కొవిడ్ బాధితులు మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్తోపాటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్, పడకల కొరత తదితర అంశాలపై ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. ప్రస్తుతం అందరం కొవిడ్తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నామని సీఎం పేర్కొన్నారు. వైరస్ ఉధృతి కారణంగా బాధాకర ఘటనలు కూడా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన చేతుల్లో లేని అంశాలకూ బాధ్యత వహించాల్సి వస్తోందని జగన్మోహన్రెడ్డి అన్నారు.