న్యూఢిల్లీ, మే 11,
దేశంలో కరోనా వైరస్ రెండో వేవ్ తీవ్రరూపంలో వ్యాపిస్తోంది. కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నా ఏమాత్రం ఫలితం ఉండడం లేదు. దీంతో విధిలేక చివరి అస్త్రంగా రాష్ట్రాలు లాక్డౌన్ విధిస్తున్నాయి. కరోనా గొలుసు తెంపేందుకు లాక్డౌనే పరిష్కారమని రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఈక్రమంలో ఇప్పటికే 14 రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తుండగా తెలంగాణ తాజాగా చేరిపోయింది. పది రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. మొదట మహారాష్ట్రతో మొదలైన లాక్డౌన్ అనంతరం ఢిల్లీ, కర్నాటక విధించగా తమిళనాడు కూడా విధించింది. ఈ విధంగా మొత్తం 15 రాష్ట్రాల్లో ప్రస్తుతం లాక్డౌన్ అమల్లో ఉంది. ప్రస్తుతం లాక్డౌన్ అమల్లో ఉన్న రాష్ట్రాలు..
తెలంగాణ: మే 12 నుంచి 22వ తేదీ వరకు
కేరళ: ఈనెల 16వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్డౌన్
ఢిల్లీ: 10వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగింది. లాక్డౌన్ పొడిగించారు.
మధ్యప్రదేశ్: ఈనెల 15 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లో ఉంది.
ఉత్తరప్రదేశ్: ఈనెల 10 వరకు లాక్డౌన్ అమలు. ప్రస్తుతం కఠిన నిబంధనలతో కర్ఫ్యూ (పాక్షిక లాక్డౌన్).
హిమాచల్ప్రదేశ్: ఈనెల 16 వరకు కొనసాగనున్న లాక్డౌన్.
తమిళనాడు: మే 10 నుంచి 24వ తేదీ వరకు లాక్డౌన్
కర్ణాటక: ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకు సంపూర్ణ లాక్డౌన్
రాజస్థాన్: ఈనెల 10 నుంచి 24 వరకు లాక్డౌన్
మహారాష్ట్ర: ఏప్రిల్ 5న కర్ఫ్యూ లాంటి లాక్డౌన్, నిషేధ ఉత్తర్వులతో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. నిషేదాజ్ఞలు మే 15 వరకు పొడిగించారు.
బిహార్: మే 4 నుంచి 15 వరకు లాక్డౌన్
చండీగఢ్: వారం రోజుల లాక్ డౌన్.
గోవా: మే 9 నుంచి 23 వరకు..
హరియాణా: మే 3 నుంచి మొత్తం వారం రోజుల పాటు 10వ తేదీ వరకు. ప్రస్తుతం తీవ్ర ఆంక్షలతో కర్ఫ్యూ కొనసాగుతోంది.
మణిపూర్: మే 7 వరకు లాక్డౌన్ విధించారు. అనంతరం తీవ్ర ఆంక్షలతో కర్ఫ్యూ కొనసాగుతోంది.
నాగాలాండ్: మే 14 నుంచి 24వ తేదీ వరకు.ఆంధ్రప్రదేశ్లో పాక్షిక లాక్డౌన్ కొనసాగుతోంది. పేరుకు కర్ఫ్యూ అని ప్రకటించినా కూడా మధ్యాహ్నం నుంచి సర్వం బంద్ కావడంతో ఏపీలోని లాక్డౌన్ కొనసాగుతున్నట్టు పరిస్థితులు ఉన్నాయి. ఇక మిగతా రాష్ట్రాల్లో పాక్షిక లాక్డౌన్, వారాంతపు లాక్డౌన్, తీవ్ర ఆంక్షలతో కర్ఫ్యూ వంటివి అమల్లో ఉన్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో భారతదేశమంతా ప్రస్తుతం లాక్డౌన్ అయినట్టు మ్యాప్ కనిపిస్తోంది. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో వైరల్గా మారిన భారతదేశ మ్యాప్ ఇప్పుడు మొత్తsం ఒకటే రంగులో ఉంటోంది. నిన్నటివరకు తెలుపు రంగులో ఉన్న తెలంగాణ ఇప్పుడు ఎరుపు రంగులోకి మారింది.ఁ
వ్యాక్సిన్ సరఫరా షురూ
ప్రముఖ కరోనా వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది. కొవాక్జిన్ టీకాలను నేరుగా రాష్ట్రాలకు పంపిణీకి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం చేసిన కేటాయింపుల ప్రకారం రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. ఇప్పటికే కోవాక్జిన్ టీకాలను 14 రాష్ట్రాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టామని భారత్ బయోటెక్ కంపెనీ కో ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ సుచిత్ర ఎల్ల ట్విటర్లో తెలిపారు. అంతేకాకుండా టీకాలను సరఫరా కోసం సంప్రదించిన ఇతర రాష్ట్రాలకు కూడా టీకాల లభ్యతను బట్టి సరఫరా చేస్తామని తెలిపారు.ప్రస్తుతం కొవాక్జిన్ టీకాను సరఫరా చేస్తోన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసోం, ఛత్తీస్ఘడ్, ఒడిశా, ఢిల్లీ, గుజరాత్, జమ్మూ-కశ్మీర్. జార్ఖండ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి. భారత్ బయోటెక్ కంపెనీ తొలుత కొవాక్జిన్ టీకాలను రాష్ట్రాలకు ఒక్కొ డోసు ధరను రూ. 600గా నిర్ణయించింది.తరువాత నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాలకు ఒక్కొ డోసు ధర రూ. 400గా నిర్ణయించారు. కొవాక్జిన్ టీకాలను ప్రైవేటు ఆస్పత్రులకు ఒక్కొ డోసును రూ.1200 అందించనున్నారు. టీకాలను ఎగుమతి చేసుకునే దేశాలకు సుమారు 15-20 డాలర్లకు అందించనుంది.