హైదరాబాద్ మే 12
భారతదేశంలోని చిన్నారులపై కోవాక్సిన్ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుపనున్నారు. 2 నుంచి 18 ఏండ్ల వయసు ఉన్న పిల్లలకు కోవాక్సిన్ రెండవ, మూడవ ట్రయల్స్ నిర్వహించనున్నారు. దీనికి నిపుణుల ప్యానెల్ ఆమోదం తెలిపింది. అంతా సక్రమంగా జరిగితే.. కెనడా, అమెరికా తర్వాత భారత్లో కూడా 18 ఏండ్లలోపు పిల్లలకు కూడా కరోనా స్వదేశీ టీకా సిద్ధంగా ఉండనున్నది.ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ పాట్నా, మెడిట్రినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నాగ్పూర్లో 525 అంశాలపై ట్రయల్ నిర్వహించనున్నారు. హైదరాబాద్లో భారత్ బయోటెక్ ప్రతిపాదనను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీ మంగళవారం పరిశీలించింది. ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్కో) సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీ (ఎస్ఈసీ) ఆమోదం తెలిపింది.మూడవ దశ ట్రయల్స్ కోసం సీడీస్కో నుంచి అనుమతి తీసుకునే ముందు డాటా అండ్ సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్ (డీఎస్ఎంబీ) కి రెండవ దశకు సంబంధించి సెక్యూరిటీ డాటాను అందించాలని నిపుణుల కమిటీ సంస్థను ఆదేశించినట్లు డీఎస్ఎంబీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు ఫిబ్రవరి 24 న జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించి, సవరించిన క్లినికల్ ట్రయల్ ప్రోటోకాల్ను ప్రవేశపెట్టాలని భారత్ బయోటెక్ను ఆదేశించారు.దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకాను భారత్ బయోటెక్.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహకారంతో దేశంలో టీకా కార్యక్రమం కోసం 18 ఏండ్ల వయసు పైబడిన వారి కోసం ఉపయోగిస్తున్నారు. 12 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు ఫైజర్-బయోఎంటెక్ కరోనా వ్యాక్సిన్ను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సోమవారం ఆమోదించింది. కెనడా గతంలో ఈ పిల్లల టీకాను ఆమోదించింది.