కరీంనగర్, మే 13,
ఈటల ఇలాకా అయిన హుజూరాబాద్లో అసలేం జరుగుతోంది. టీఆర్ ఎస్ కేడర్ను రెండుగా చీల్చే ప్రయత్నం సాగుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తొంది. ఈటల రాజేందర్పై భూ కబ్జా ఆరోపణలు వచ్చినప్పటి నుంచి హుజూరాబాద్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఆరోపణలు వచ్చిన వెంటనే నియోజకవర్గానికి వెళ్లిన ఈటల తన అనుచరులతో మంతనాలు జరిపారు.ఏ ఒక్కరూ చేయిదాటిపోకుండా చూసుకునేందుకు వరుస చర్చలు జరిపారు. ఇదిలా ఉంటే టీఆర్ ఎస్ ఎలాగైనా ఈటలను ఒంటరి చేయాలని ప్లాన్ వేసింది. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్ను రంగంలోకి దింపింది. ఆయన ఈటలకు అనుకూలంగా ఉన్న టీఆర్ ఎస్ సెకండ్ గ్రేడ్ నాయకులను టార్గెట్ చేశారు. వారందరినీ వరుసగా తన క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకుని చర్చలు జరుపుతున్నారు.వారందరికీ నామినేటెడ్ పోస్టులు, ఇతర కార్లు, గిఫ్ట్లు ఇస్తామంటూ టీఆర్ ఎస్వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫస్ట్ గ్రేడ్ నాయకులను మాత్రం టచ్ చేయట్లేదు. ఎందుకంటే వారంతా కచ్చితంగా ఈటల వెంటే ఉంటారు. వారందరినీ ఆ స్థాయికి తీసుకొచ్చింది ఈటలనే కాబట్టి వార్ ఇన్డైరెక్ట్గా అయినా ఈటలకే సపోర్టు చేస్తారని వారిని గంగుల మాట్లాడించట్లేదు. టీఆర్ ఎస్ నుంచి టికెట్లు, ఇతర పదవులు ఆశించి భంగపడ్డ వారినే టార్గెట్ చేసుకుని ఈటలకు వ్యతిరేకంగా టీమ్ను తయారు చేస్తున్నారు గంగుల కమలాకర్. మరో వైపు రుసగా ప్రతిపక్ష నాయకులను కలుస్తున్నారు ఈటల రాజేందర్. తనను మంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి మొన్నటి వరకు మౌనంగా ఉన్న ఆయన నిన్న, ఈ రోజు వరుసగా కాంగ్రెస్, బిజెపి, టీఆర్ ఎస్ అసంతృప్తులతో భేటీ అవుతున్నారు. అయితే ఎక్కడా అధికారికంగా తన భేటీపై స్పందించట్లేదు. కేవలం స్నేహపూర్వకంగానే సమావేశం అవుతున్నానని చెబుతున్నారు. టీఆర్ ఎస్ నేత ధర్మపురి శ్రీనివాస్తో ఆయన సమావేశం అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన దాదాపు గంటన్నరసేపు చర్చించారు. అయితే ఇదే సమయంలో అక్కడకు వచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్తో కూడా ఈటల చర్చించారు.ఆయనతో 20నిముషాల పాటు మాట్లాడారు ఈటల రాజేందర్. తన పోరాటానికి మద్దతివ్వాలని ప్రతిపక్ష నేతలను కలుస్తూ కోరుతున్నట్టు ఈటల రాజేందర్ తెలుపుతున్నారు. అయితే ఆయన భేటీ అవుతున్న నేతలందరూ ఇప్పుడు రాజకీయంగా అసంతృప్తిగా ఉన్న వారే కావడంతో.. వారందరినీ కలుపుకుని ఆయన ఓ కొత్త పార్టీ పెడతారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంకో వైపు బీజేపీలోకి వెళ్తారా అని కూడా చర్చసాగుతోంది. అయితే అసంతృప్తి నేతలను కలవడం వెనక కొత్త పార్టీ వ్యూహమున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై త్వరలోనే ఆయన ఏదైనా ప్రకటన చేస్తారేమో చూడాలి