న్యూఢిల్లీ మే14
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్గా మారి తీరం వైపు దూసుకొస్తున్నదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫాన్ తీర ప్రాంత రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆ ఐదు రాష్ట్రాలకు సహాయక చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపించింది. ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 53 బృందాలను ఐదు రాష్ట్రాల్లో సిద్ధంగా ఉంచినట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ సత్యప్రధాన్ ట్వీట్ చేశారు. తౌక్తా తుపాన్ ప్రభావంతో మే 16 నుంచి భారీ వర్షాలు కురువనున్నాయని ఐఎండీ అధికారులు చెప్పారు. తుఫాన్వల్ల మే 15న గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. మే 16న గంటకు గాలి వేగం 80 కిలోమీటర్లకు పెరుగవచ్చని వారు అంచనా వేశారు.