కోల్కతా మే 18
నారద స్టింగ్ ఆపరేషన్లో పట్టుబడిన ఇద్దరు బెంగాల్ మంత్రులకు బెయిల్ దొరికినా.. వారితో పాటు మరో ఇద్దరు తృణమూల్ నేతలు సోమవారం రాత్రి జైలులోనే గడిపారు. తమ మంత్రులను కాపాడుకునేందుకు సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సోమవారం ఉదయం మంత్రులు ఫిర్హద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మంత్రులతో పాటు ఎమ్మెల్యే మదన్ మిత్ర, సోవన్ ఛటర్జీలు కూడా రాత్రంతా జైలులోనే గడిపారు. అయితే తనను కూడా అరెస్టు చేయాలంటూ బెంగాల్ సీఎం దీదీ .. సీబీఐ ఆఫీసుకు వెళ్లి హంగామా చేసిన విషయం తెలిసిందే. ఏడు గంటల డ్రామా తర్వాత నలుగురు తృణమూల్ నేతలకు బెయిల్ దొరికినా.. సాయంత్రం ఆ బెయిల్ను సవాల్ చేస్తూ సీబీఐ కోర్టును ఆశ్రయించింది. తృణమూల్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో.. మరో రాష్ట్రంలో విచారణ చేపట్టేందుకు కేసును బదిలీ చేయాలని కోర్టును సీబీఐ కోరింది. దీంతో నారద స్టింగ్ ఆపరేషన్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ నేతలు జైలు కస్టడీలోనే ఉంటారని కోర్టు చెప్పింది. నలుగురిని కోల్కతాలోని ప్రెసిడెన్సీ జైలుకు తరలించారు.2104లో జరిగిన నారద స్టింగ్ ఆపరేషన్లో సువేందు అధికారి కూడా ఉన్నాడు. ప్రస్తుతం సువేందు బీజేపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అతన్ని ఎందుకు అరెస్టు చేయలేదని తృణమూల్ నేతలు ప్రశ్నించారు.