అహ్మదాబాద్ మే 18
అతి భీకర తుఫాన్ తౌక్టే.. ఇవాళ ఉదయం గుజరాత్లో తీరం దాటింది. సౌరాష్ట్ర ప్రాంతంలోకి తుఫాన్ ప్రవేశించింది. అయితే స్వల్పంగా బలహీనపడినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బలమైన గాలులు వీస్తున్నాయి. గాలి వేగం గంటకు 115 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు. ఇవాళ ఉదయం వాతావరణశాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. అహ్మదాబాద్కు దక్షిణం వైపున 230 కిలోమీటర్ల దూరంలో తౌక్టే తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నది. ఇవాళ సాయంత్రం వరకు మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. కొంకన్ తీరం, గుజరాత్, రాజస్థాన్లోని అనేక ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. చెట్లను, పంటనే నష్టం చేసే బలమైన గాలులు కూడా వీయనున్నాయి. శక్తివంతమైన గాలులకు కొన్ని చోట్ల విద్యుత్తు స్తంభాలు కూలిపడ్డాయి. కొన్ని చోట్ల దాదాపు గంటకు 190 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి.