తిరువనంతపురం, మే 18,
కేరళలో బుధవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి ఘన విజయం సాధించడంతో వరుసగా రెండోసారి పినరయ్ విజయన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎంతోపాటు మంత్రివర్గం కూడా ప్రమాణస్వీకారం చేయనుంది. ఈ నేపథ్యంలో పినరయ్ క్యాబినెట్ కూర్పు దాదాపు ఖరారయ్యింది. అయితే, ఇందులో మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజకు మాత్రం చోటుదక్కలేదని సమాచారం.కరోనా వైరస్ కట్టడి చర్యల్లో కేరళ ఆరోగ్య మంత్రిగా శైలజ తన పనితీరుతో సర్వత్రా ప్రశంసలందుకున్నారు. అటువంటి ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోలేదని తెలుస్తోంది. మంత్రిగా కంటే ఆమె శైలజా టీచర్గానే సుప్రసిద్ధురాలు.. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మట్టనూరు నుంచి ఆమె 60వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కరోనా వైరస్ను తరిమికొట్టేందుకు ఏం చేయాలో ఆలోచించి అందుకు తగ్గట్టు కార్యాచరణను రూపొందించారు.. అందరిచేత శభాష్ అనిపించుకున్నాఅంతర్జాతీయ వేదికలపై కూడా ప్రశంసలు అందుకున్నారు. బ్రిటన్కు చెందిన ప్రాస్పెక్ట్ మ్యాగజైన్ కరోనా సంక్షోభం సందర్భంగా ప్రపంచంలో బెస్ట్ థింకర్స్ ఎవరు అన్నదానిపై సర్వే చేపట్టగా శైలజ నంబర్వన్గా నిలిచారు. కరోనా కట్టడిలో విజయం సాధించి, దేశం నుంచే ఆ వైరస్ను తరిమికొట్టారన్న ప్రశంసలను అందుకున్న న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్ను శైలజ రెండో స్థానంలోకి నెట్టడం విశేషం.తన పనితీరుతో అంతర్జాతీయంగా ప్రశంలందుకున్న కేకే శైలజకు మంత్రివర్గంలో మళ్లీ చోటు దక్కకపోవడానికి కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. రాజకీయాల్లోకి రాకముందు స్కూల్ టీచర్గా పనిచేసిన శైలజలో ఆ క్రమశిక్షణ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఆరోగ్య శాఖ మంత్రిగా శైలజ బాధ్యతనెరిగి ప్రవర్తించారు. కొన్నేళ్ల కిందట నిఫా వైరస్ ప్రబలినప్పుడు కూడా ఇలాగే కష్టపడి దానిని నియంత్రించగలిగారు. కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన టెస్ట్, ట్రేస్,ట్రీట్మెంట్ను పక్కాగా పాటించారు.