YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఒంటరైన రఘురామ..రామ

ఒంటరైన రఘురామ..రామ

ఏలూరు, మే 19, 
ఎగిరితే పడక తప్పదు. తిరిగి నేలను ముద్దాడకా తప్పదు. తనకు తిరుగులేదని చెప్పుకునేవారంతా కూడా ఏదో సందర్భంలో నేలకు దిగినవారే. ఇపుడు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో అదే నిజమై రుజువై నిలుస్తోంది. గోదావరి జిల్లాల్లో క్షత్రియ సామాజిక వర్గం బలంగా ఉంటుంది. వ్యాపార రాజకీయ, సినీ రంగాల్లో వారు బాగానే రాణిస్తున్నారు. అలాంటి క్షత్రియ సామాజిక వర్గంలో ఇపుడు రెబెల్ ఎంపీకి మద్దతు కరవు అయింది. ఆయన అరెస్ట్ తరువాత ఏ ఒక్క బిగ్ షాట్ కూడా ఖండించడానికి ముందుకు రాకపోవడమే రాజు ది బలమా? వాపా? అన్నది తెలియచేస్తోంది అంటున్నారు.రఘురామ కృష్ణంరాజు రాజకీయాల్లో ఎంతటి నాయకుడో తెలియదు కానీ ఆయన ఎన్నిక అయింది మాత్రం ఫస్ట్ టైమ్ ఎంపీగా 2019లో మాత్రమే. అది కూడా వైసీపీ టికెట్ మీద, జగన్ బొమ్మ బొమ్మతోనే అంటున్నారు ఆయన సామాజికవర్గం నేతలు. ఇదే రఘురామ కృష్ణంరాజుకు అంత బలం ఉంటే 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరినా ఎందుకు టికెట్ ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్నారు. జగన్ వేవ్ లో కూడా వైసీపీ ఎమ్మెల్యేల కంటే తక్కువ ఓట్లు రాజుకు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. గెలిచాకా తానే వైసీపీలో సీనియర్ నేతను అని రఘురామ కృష్ణంరాజు భావించడం, అహంకరించడం వల్లనే సీన్ ఇంతదాకా వచ్చిందని అంటున్నారు.వైసీపీలో రఘురామ కృష్ణంరాజుకు ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ పార్టీ నుంచి తప్పుకుని గౌరవంగా బయటకు వచ్చేస్తే సొంత సామాజికవర్గంతో పాటు బయట కూడా మద్దతు దక్కేదని అంటున్నారు. అలా కాకుండా ఎంపీ సీటుని అతుక్కుపోయి గెలిపించిన పార్టీనే నిందిస్తే ఎవరు సపోర్టు గా ఉంటారు అన్న ప్రశ్న వస్తోంది. మరో వైపు చూస్తే ఆయన గోదావరి జిల్లాలో రాజకీయంగా స్ట్రాంగ్ లీడర్ ఏమీ కాదు. ఒక పార్టీని సవాల్ చేస్తే మరో పార్టీ అక్కున చేర్చుకునే పరిస్థితులు కూడా ఉండవు అంటున్నారు. ఇంతలా ఈ రోజు మద్దతు ఇస్తున్న టీడీపీ కూడా వచ్చే ఎన్నికల్లో రఘురామ కృష్ణంరాజుకి టికెట్ ఇస్తుందని కూడా ఎవరూ గట్టిగా చెప్పలేకపోతున్నారు.ఇపుడు సీన్ చూస్తే అదే అనిపిస్తోంది. వైఎస్సార్ ఆత్మ, రఘురామ కృష్ణంరాజు వియ్యంకుడు అయిన కేవీ రామచంద్రరావు వంటి వారు సైలెంట్ గానే ఉంటున్న పరిస్థితి. మరో వైపు కాంగ్రెస్ మాజీ ఎంపీలు, వైఎస్సార్ కి సన్నిహితంగా ఉన్న వారు కూడా రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ మీద ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. దీనిని బట్టి చూస్తే విపక్షాల రాజకీయ క్రీడకు ఆయన ఒక ఆయుధంగా మారారు తప్ప నిజంగా ఆయన బలం ఏంటన్నది ప్రశ్నగానే ఉంది. సొంత ఇలాకాలో ఆయనకు మద్దతు లేకపోవడంతో జగన్ని విమర్శించి హీరో అవుదామనుకున్న రఘురామ కృష్ణంరాజుకి తత్వం బోధపడిందా అన్న వారే ఉన్నారు. చంద్రబాబు సహా విపక్షం మద్దతు ఉందనుకుని ఇక మీదట కూడా దూకుడుగా వెళ్తే ఆయనకే రాజకీయంగా చిక్కులు వస్తాయని అనే వారూ ఉన్నారు. మొత్తానికి రచ్చబండ ఢిల్లీలో రోజూ పెట్టి సెటైర్లు పేల్చే రాజు గారికి పల్లెటూర్లో రచ్చ బండ తీర్పు చేదుగానే ఉంటుందని అంటున్నారు.

Related Posts