న్యూఢిల్లీ మే 19
కొవిడ్ చికిత్స ప్రోటోకాల్ నుంచి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ను తొలగించాలని భావిస్తున్నట్లు సర్ గంగారామ్ ఆసుపత్రి చైర్మన్ డీఎస్ రాణా పేర్కొన్నారు. కొవిడ్-19 చికిత్సలో బాధితులపై ప్రభావం చూపిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. ఇప్పటికే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్లాస్మా చికిత్సను ప్రోటోకాల్స్ నుంచి తొలగించింది. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఏర్పడ్డ యాంటీబాడీలు రోగులపై ప్రభావం చూపిస్తాయని భావించామని, ఈ క్రమంలోనే ప్లాస్మా థెరపీ చేపట్టామన్నారు. అయితే, ఈ చికిత్సతో బాధితులు కోలుకుంటున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో దాన్ని కుడా ప్రోటోకాల్ నుంచి తొలగించామన్నారు.ప్రస్తుతం కరోనా చికిత్సలో వినియోగిస్తున్న రెమ్డెసివిర్కు సంబంధించి అలాంటి ఆధారాలు లేవని, అలాంటి మందులను వాడడాన్ని నిలిపివేయాలని డాక్టర్ రాణా అభిప్రాయపడ్డారు. త్వరలోనే అవన్నీ తొలగించబడుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం మూడు మందులు మాత్రమే పని చేస్తున్నాయని రాణా తెలిపారు. వైద్యబృందం మరింత సమాచారం సేకరించేందుకు ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రెమ్డెసివిర్కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో డాక్టర్ రాణా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సోమవారం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం కోవిడ్-19 కోసం సిఫారసు చేసిన చికిత్స ప్రోటోకాల్స్ నుంచి ప్లాస్మా వాడకాన్ని తొలగించింది.ఈ సందర్భంగా ఐసీఎంఆర్, ఎయిమ్స్, టాస్క్ ఫోర్స్, జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సంయుక్తంగా కొవిడ్ రోగులకు చికిత్సకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను విడుదలను చేశాయి. శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుంటే స్వల్ప లక్షణాలుగా భావించాలని సూచించింది. అలాంటి వారిని హోమ్ ఐసోలేషన్లోనే ఉంచి చికిత్స అందించాలని చెప్పింది. రక్తంలో ఆక్సిజన్ స్థాయి 90 – 93 మధ్యన ఉన్నా.. రెస్పిరేటరీ రేటు నిమిషానికి 24 కన్నా ఎక్కువగా ఉన్నా.. మధ్యస్థ స్థాయిగా భావించాలని, ఇలాంటి రోగులను ఆస్పత్రిల్లోని వార్డులో చేర్పించి చికిత్స ఇవ్వాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.