కోల్ కత్తా, మే 19,
నారదా స్కాం పశ్చిమ బెంగాల్లో మారోమారు ప్రకంపనలు రేపుతోంది. మమతా బెనర్జీ క్యాబినెట్లోని ఇద్దరు మంత్రులు సహా కీలక నేతలను సీబీఐ అరెస్టు చేయడంతో వివాదం ముదిరింది. ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. సీబీఐ అధికారులకు గవర్నర్ అనుమతులు ఇవ్వడంతోనే అరెస్టులు జరిగాయని.. స్పీకర్ అనుమతి లేకుండానే ఎలా అరెస్టు చేస్తారంటూ టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ ధన్కర్ తీరుపై మండిపడింది. దీంతో బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి.గవర్నర్ ధన్కర్పై టీఎంసీ నేతలు అగ్గిమీదగుగ్గిలం అయిపోతున్నారు. తీవ్ర నిరసనలతో పాటు దుర్బాషలాడుతున్నారు. తాజాగా గవర్నర్ పుట్టిన రోజు నాడే ఆయన బంగ్లా ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు గొర్రెలతో నిరసన చేపట్టడం మరో వివాదానికి దారితీసింది. బుధవారం ఉదయం కొందరు వ్యక్తులు కోల్కతాలోని గవర్నర్ బంగ్లా ఉత్తర ద్వారం వద్ద గొర్రెలను తీసుకొచ్చి నిరసన తెలిపారు. కొద్దిసేపటి అనంతరం భద్రతా సిబ్బంది గొర్రెలను వెళ్లగొట్టారు.ఈ ఘటన గవర్నర్ ధన్కర్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మెయిన్ గేటు ఎదుట గొర్రెలతో నిరసన చేస్తుంటే కోల్కతా పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గొర్రెల నిరసన వీడియోను ఆయన ట్వీట్ చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నా ఇలాంటి చర్యలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాజ్భవన్ ముందు గొర్రెలతో నిరసన తెలియజేసింది తామేనని కోల్కతా నాగరిక్ మన్సా ప్రతినిధులు తెలిపారు. కరోనా విలయతాండవం చేస్తుంటే పట్టించుకోకుండా ఇతర అంశాలపై గవర్నర్ స్పందించడం బాధాకరమని. అందుకే గొర్రెల మందతో నిరసన తెలిపినట్లు చెప్పారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పడం విశేషం.