YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ ఉప ఎన్నికపై పోస్టుమార్టం

బీజేపీ ఉప ఎన్నికపై పోస్టుమార్టం

తిరుపతి, మే 20, 
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల విషయంలో ఆ పార్టీ అభ్యర్థి రత్న ప్రభ తీవ్ర అసంతృప్తిిని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కనీస ఓట్లను కూడా సాధించక పోవడం వెనక నేతల వైఫల్యమే కారణమని రత్న ప్రభ భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర నాయకత్వానికి ఆమె నివేదిక పంపినట్లు సమాచారం. తనకు పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి పెద్దగా సహకారం అందలేదని, సమన్వయం కొరవడిందని రత్న ప్రభ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ పెద్ద ఆశలే పెట్టుకుంది. అందుకే ఆచితూచి అభ్యర్థి ఎంపికలోనూ అడుగులు వేసింది. సుదీర్ఘ మంతనాల తర్వాత రత్న ప్రభను ఎంపిక చేసింది. తెలుగుదేశం పార్టీ బలహీనపడిందని భావించిన బీజేపీ తమకు ఈసారి గెలవకపోయినా సెకండ్ ప్లేస్ లో ఉంటామని ఆశించింది. ఈ మేరకు దాదాపు నాలుగు నెలల ముందునుంచే ప్రయత్నాలు ప్రారంభించింది.తిరుపతి ఉప ఎన్నికను సీనియర్ నేత సునీల్ దేవ్ ధర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన రత్నప్రభ ఎంపికలోనూ ఆయనే కీలక పాత్ర పోషించారు. అయితే నేతలు కేవలం మీడియాకు మాత్రమే పరిమితమయ్యారని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయలేకపోయారని రత్న ప్రభ భావిస్తున్నారు. నేతలందరూ తిరుపతి చుట్టూ తిరిగారని, కీలకమైన నియోజకవర్గాలను విస్మరించారంటున్నారు.జనసేన పార్టీతో పొత్తు ఉండటంతో కనీస ఓట్లు సాధిస్తామన్న నమ్మకం పెట్టుకున్నారు. అందుకే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తిరుపతి ప్రచారానికి వచ్చిన జేపీ నడ్డా సయితం నేతల మధ్య సమన్వయం లేకపోవడాన్ని గుర్తించి వారిని మందలించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా యే స్వయంగా రత్న ప్రభను ఓటమికి గల కారణాలను తెలపాలని కోరినట్లు తెలిసింది. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నికలో దారుణ ఓటమి బీజేపీ నేతల భవిష్యత్ కు ఇబ్బందికరంగా మారనుంది.
రాజకీయాలకు పనబాక దూరం
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల దెబ్బకు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? అంటే అవుననే చెబుతున్నారు. వరసగా రెండు ఎన్నికల్లో ఓటమి పాలు కావడం, పార్టీ నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో రాజకీయాల నుంచి వైదొలగడమే బెటర్ అని పనబాక లక్ష్మి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేమని వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో పనబాక లక్ష్మి పోటీ చేసేందుకు తొలుత నిరాకరించారు. అయితే చంద్రబాబు వత్తిడి చేసి ఆమెను పోటీకి దింపారు. ఫలితం ముందుగానే తెలిసిపోతుండటంతో పనబాక లక్ష్మి తొలినుంచి యాక్టివ్ గా లేరు. మూడు నెలల ముందు అభ్యర్థిగా ప్రకటించినా పనబాక లక్ష్మి పెద్దగా యాక్టివ్ గా లేరు. అందరికంటే ముందు ప్రచారాన్ని ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించినా ఆమె నిరాసక్తత కనపర్చారు.ఇక తిరుపత ఉప ఎన్నికల సందర్భంగా పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయలేదని పనబాక లక్ష్మి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయి నేతలు పనిచేసినప్పటికీ నియోజకవర్గాల్లో టీడీపీ బాధ్యులు పార్టీ ఇచ్చిన నిధులను కూడా సక్రమంగా ఖర్చు చేయలేదని ఆమె చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడంలో కూడా స్థానిక నాయకత్వం అశ్రద్ధ చూపెట్టారని పనబాక లక్ష్మి చెప్పినట్లు సమాచారం.ఇంత దారుణ ఓటమిని చవి చూస్తానని తాను అనుకోలేదని పనబాక లక్ష్మి చెప్పారు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు వంటి నేతలు తన విజయం కోసం శ్రమించినప్పటికీ స్థానిక నాయకత్వంపై పనబాక లక్ష్మి ఆగ్రహంగా ఉన్నారు. అందువల్లనే తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ఆమె చంద్రబాబుతో చెప్పినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు మాత్రం గెలుపోటములు సహజమేనని, పునరాలోచించుకోవాలని కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related Posts