న్యూఢిల్లీ మే 20
కరోనాకు వ్యతిరేకంగా సాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్లో టీకాల వృథాను ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. గురువారం ఆయన పది రాష్ట్రాలకు చెందిన 54 జిల్లాల అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. సందర్భంగా కరోనా కట్టడి తీసుకుంటున్న చర్యలను, ప్రణాళికలను అధికారులు మోదీకి వివరించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడి చర్యలపై ప్రధాని ఆరా తీశారు. భేటీలో ఛత్తీస్గఢ్, హర్యానా, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, బెంగాల్ అధికారులు పాల్గొన్నారు.అనంతరం ప్రధాని మాట్లాడుతూ వందేళ్లలో వచ్చిన అతిపెద్ద విపత్తు కరోనా అన్నారు. కరోనా వైరస్ కారణంగా జిల్లా అధికారులు.. తమ విధులు నిర్వర్తించటం సవాల్గా మారిందన్నారు. అందుబాటులో ఉన్న వనరులతో మహమ్మారిపై పోరాడాలన్నారు. కరోనా వైరస్ ఉత్పరివర్తనం చెంది వ్యాప్తి చెందుతోందన్నారు. వైరస్పై విధానాలు, వ్యూహాలు నిత్యం మార్చుకోవాలని చెప్పారు. మ్యుటెంట్ల నేపథ్యంలో యువత, చిన్నారులపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా బారినపడిన యువత, చిన్నారుల వివరాలు సేకరించాలని చెప్పారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వాడుకోవాలన్నారు.ఈ సందర్భంగా వ్యాక్సిన్ వృథాపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని.. టీకా వృథాను ఆపడం అత్యంత ముఖ్యమన్నారు. ఒక్కో డోసు వృథా.. ఒక జీవితానికి రక్షణ కల్పించే అవకాశం వృథా అయినట్టేనన్నారు. వ్యాక్సిన్ వృథాను అరికట్టాలని, పట్టణ.. గ్రామీణ ప్రాంతాల్లో అధికారులంతా పర్యవేక్షించాలని కోరారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ల సరఫరాపై స్పందిస్తూ ఆరోగ్య మంత్రిత్వశాఖ 15 రోజుల పాటు టీకాలకు సంబంధించిన సమాచారం రాష్ట్రాలకు అందిస్తుందని, వ్యాక్సినేషన్లో సహాయపడుతుందన్నారు.ప్రజలు తమ జీవనాన్ని సులభతరం చేసేందుకు ఉచిత రేషన్, ఇతర నిత్యావసర సామగ్రి అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను కోరారు. ప్రాణాలు కాపాడడడంతో పాటు ప్రతి వ్యక్తి జీవన సౌలభ్యం తమ ప్రాధాన్యతని పేర్కొన్నారు. పేదలకు ఉచిత రేషన్ సౌకర్యాలు ఉండాలని, నిత్యావసర సరుకులు నల్లబజారుకు తరలించకుండా చూడాలన్నారు. ఇవన్నీ పోరాటంలో గెలిచేందుకు, ముందుకు సాగేందుకు అవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు.