YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కరోనా సంక్షోభాన్ని మానవ విపత్తుగా పరిగణించాలి... ఆసుపత్రులన్నింటినీ జాతీయం చేయాలి! భారత ప్రధాన న్యాయమూర్తికి 47 మంది వైద్యుల లేఖ

కరోనా సంక్షోభాన్ని మానవ విపత్తుగా పరిగణించాలి... ఆసుపత్రులన్నింటినీ జాతీయం చేయాలి! భారత ప్రధాన న్యాయమూర్తికి 47 మంది వైద్యుల లేఖ

న్యూ ఢిల్లీ మే 20
సర్, మేము ప్రగతిశీల డాక్టర్లుగా మన దేశంలో కొవిడ్–19 వల్ల తలెత్తిన పరిస్థితిని మీ దృష్టికి తీసుకు వస్తున్నాం. మన భారత ప్రభుత్వమూ రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్–19 రెండో ప్రళయాన్ని అధిగమించడంలో విఫలమయ్యాయి. ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ లేకుండా ఎన్నికల కమిషన్ వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ఎన్నికల మూలంగా దేశంలో కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయి. కొవిడ్–19 మొదటి వేవ్ అదుపులోకి రాకముందే ప్రభుత్వాలు పెద్ద ఎత్తున మత కార్యక్రమాలను నిర్వహించాయి. వైరస్ విలయతాండవం చేస్తుంటే కూడా సిబ్బంది నియామకం, ఆక్సిజన్ సరఫరా, బెడ్ల పెంపుదల, మెడిసిన్ అందుబాటులోకి తేవడం వంటి కార్యక్రమాల గురించి ప్రభుత్వాల దగ్గర కనీస కార్యక్రమం లేదు. కొవిడ్–-19 రెండవ వేవ్ వస్తదని ఊహాగానాలు ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఎదుర్కోడానికి సిద్ధం కావడంలో పూర్తిగా విఫలమయ్యాయి. భారత దేశంలో ఏప్రిల్ 15 నుండి ప్రతి రోజు 2 లక్షల కేసులు నమోదవుతూ వచ్చాయి. ఏప్రిల్ 27 నాడు 3 లక్షల 60 వేల 960తో ప్రపంచంలోనే ఎక్కువ కేసులు నమోదైన దేశంగా మన దేశం ఘనతకెక్కింది. మే 4న భారత్ 2కోట్ల కేసుల మైలు రాయిని దాటింది. తప్పుడు లెక్కలు చూపించడానికి ఉత్తరప్రదేశ్‌లో శవాలను నదుల్లోకి విసిరేస్తున్నారు.
చాలా తక్కువ సంఖ్యలో కోవ్యాక్సిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లను ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రెండూ కూడా కొరతలో ఉన్నవి. మొదటి డోసు వేసుకున్నవారికి రెండో డోసు దొరకని పరిస్థితి ఉన్నది. వ్యాక్సిన్ల కొరకు వెళ్లి కొవిడ్ బాధితులుగా తిరిగివస్తున్న వైనం కూడా ఉన్నది. రోగ నిర్ధారణ కేంద్రాలూ టీకా ఇచ్చే కేంద్రాలూ రెండూ ఒకే చోట ఉండటం దీనికి ప్రధాన కారణం. ప్రభుత్వాలు ప్రజల పట్ల తమ ప్రాథమిక బాధ్యతలను, విధులను గాలికి వదిలేసి వారి బాధలను తగ్గించడానికి ఏ మాత్రం కృషి చెయ్యట్లేదు.
మరణాల రేటు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు కొవిడ్–19 లింకును అడ్డుకోటానికి సిద్ధంగా లేవు. గణాంకాల ప్రకారం వైద్య సిబ్బంది సరిపడినంత లేరు, ఇప్పుడున్న వారితో రోగులకు చికిత్స చేయటం కష్టంతో కూడుకున్నది. తక్షణమే వైద్య సిబ్బంది నియామకం చేపట్టాలి. కొవిడ్–19 మహమ్మారి తీవ్రతరం కావటానికి ప్రధాన కారణం పాలకుల వైఫల్యమే. ప్రజలకు సరిపడా వ్యాక్సిన్లు ఇవ్వటానికి నిర్ణీత సమయంలో కొనుగోలు చేయడంలో/ ఆర్డర్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రజా శ్రేయస్సును నిర్లక్ష్యం చేస్తూ ప్రజోపయోగం లేని ప్రాజెక్టులకు డబ్బులు కేటాయిస్తోంది. ఈ సంక్షోభంలో కూడా మెడికల్ మాఫియా రెచ్చిపోతున్నది.
అధికారంలో ఉన్న ప్రభుత్వాల ప్రతినిధులు– ఎం.పి, ఎం.ఎల్.ఏ, మంత్రులు– అశాస్త్రీయ భావజాలాన్ని ఒక పథకం ప్రకారం ప్రచారం చేస్తున్నారు. కొవిడ్–-19 సంక్రమించకుండా బాధితులు ఉపశమనం పొందాలంటే ఆవు మూత్రం తాగాలని, ఆవు పేడ రాసుకోవాలని బహిరంగంగా ప్రకటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A[h] లో ప్రతి పౌరుడిలో శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేయడం కర్తవ్యంగా పేర్కొంటుంది. లౌకిక వాదం, మానవతా వాదం, విచారణ, సంస్కరణ స్ఫూర్తిని అభివృద్ధి చేయడానికి శాస్త్రీయ దృక్పథం సహాయ పడుతుంది. దీని ప్రకారం అశాస్త్రీయ భావాలను ప్రచారం చేస్తున్నవారిని చట్ట ప్రకారం శిక్షించాలి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఫెడరల్ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని, ఇక్కడ పేర్కొంటున్న అవసరాలు నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 1. ఈ సంక్షోభాన్ని మానవ విపత్తుగా పరిగణించాలి. 2. యుద్ధ ప్రాతిపాదికన అన్ని ఆసుపత్రులను జాతీయం చేయాలి. 3. కార్పొరేట్ మాఫియాను అరికట్టాలి. 4. ప్రతి మండలానికి వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మించాలి. 5. ప్రభుత్వ ఖర్చులతోనే అంబులెన్సు సర్వీసులను కొనసాగించాలి. 6. పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టాలి. 7. కరోనా బాధితులతో పాటుగా ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్యం అందించాలి. 8. పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి. 9. కొవిడ్–-19 పరీక్షా కేంద్రాలనూ వ్యాక్సిన్ కేంద్రాలనూ వేర్వేరు చోట్ల నిర్వహించాలి. 10. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రజలకు సరిపడా వ్యాక్సిన్లను కొనుగోలు చేయాలి. 11. బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిని చట్ట ప్రకారం శిక్షించాలి. 12. కొవిడ్-–19 రెండవ వేవ్‌ను నియంత్రిస్తూ, దేశాన్ని మూడో వేవ్లో కి వెళ్లకుండా శాస్త్రీయ నిర్ణయాలు చేయాలి. ప్రజల ప్రాణాలను రక్షించాలి. 13. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్టులో కనీసం పదిశాతాన్ని వైద్య, ఆరోగ్య రంగాలకు కేటాయించాలి. కొవిడ్ పాండెమిక్ లాంటి విపత్తులకు ప్రత్యేకంగా అవసరమైన నిధులను తక్షణం విడుదల చేయాలని కోరారు.

Related Posts