అదిలాబాద్, మే 21,
రాబోయే హరితహారం కార్యక్రమం కోసం నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈజీఎస్ నర్సరీలు, వనసంరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో వన నర్సరీలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు గ్రామ పంచాయతీలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిధులను నేరుగా బ్యాంక్ ఖాతాలో జమచేస్తున్నాయి.జిల్లాలో 5 మున్సిపాలిటీలు, 18 మండలాల్లోని 380 గ్రామపంచాయతీల పరిధిలో కోటి మొక్కలను రాబోయే హరితహారంలో నాటేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. మల్యాల మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఉండగా ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సరీలో 40 వేల మొక్కలను సిద్ధం చేస్తున్నారు. వేసవిలో మొక్కల పెంపకానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.నర్సరీల్లో గులాబీ, మల్లె, ఎర్ర మందారం, గోరింటాకు, అశ్వగంధ, కృష్ణతులసి మొక్కలను పెంచుతున్నారు. సీతాఫలం, నిమ్మ, జామ, ఖర్జూర, దానిమ్మ, సపోట, మామిడి వంటి పండ్ల మొక్కలను సిద్ధం చేస్తున్నారు. వాటితో పాటు పొలం గట్లపై టేకు మొక్కలు నాటుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కలబంద, టేకోమా, నీలగిరి అశ్వగంధ వంటి ఔషధ మొక్కలు, సీమ తంగెడు, పైడి తంగెడు, సుబాబుల్, గుల్మోహర్, వేప, కానుగ, కుంకుడు, అస్మాతి, తదితర మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నారు.