వారణాసి మే 21
ఉత్తరప్రదేశ్లోని కాశీలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల గురించి అక్కడి డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లతో ప్రధాని మోదీ ఇవాళ వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్19పై పోరాడుతున్న సమయంలో.. బ్లాక్ ఫంగస్ రూపంలో కొత్త సవాల్ ఎదురైందని, ఆ వ్యాధిని అరికట్టేందుకు, అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకునే రీతిలో దృష్టి పెట్టాలన్నారు. వ్యాక్సినేషన్ వల్ల ఫ్రంట్లైన్ వర్కర్లకు రక్షణ కలిగిందని, వారంతా ప్రజా సేవ చేస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికీ కోవిడ్ టీకాలను ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. జహా బీమార్.. వహా ఉపచార్ అన్న విధానాన్ని అవలంబిస్తూ.. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి మందులు అందిస్తున్న తీరు ప్రశంసనీయమన్నారు. పండిట్ రాజన్ మిశ్రా కోవిడ్ హాస్పిటల్ను వారణాసిలో ఏర్పాటు చేసిన తీరు అద్భుతమన్నారు. ఆ హాస్పిటల్లో చాలా వేగంగా ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లను పెంచినట్లు తెలిపారు.