న్యూఢిల్లీ, మే 21,
ఢిల్లీలో కొత్త కరోనా కేసులు గురువారం 3,009కి పడిపోయాయి. దీంతో పాజిటివిటీ రేటు 4.76 శాతం దిగువకు పడిపోయింది. ఏప్రిల్ 4 తర్వాత ఢిల్లీలో ఇంత తక్కు స్థాయికి పాజిటివిటీ రేటు పడిపోవడం ఇదే ప్రథమం. దీంతో ఢిల్లీలో లాక్డౌన్ ఎత్తివేతకు ఒత్తిడి పెరుగుతున్నది. కాకపోతే వైద్య నిపుణులు మాత్రం లాక్ డౌన్ ఫలితంగానే కరోనా దిగివచ్చిందని అంటున్నారు. ఢిల్లీలో కొత్త కరోనా కేసులు వరుసగా మూడోరోజు 4 వేల దిగువకు పడిపోవడం గమనించదగ్గ విషయం. ఇకపోతే గురువారం 252 కరోనా మరణాలు నమోదయ్యాయి. 2020 ఆరంభంలో కరోనా కేసులు మొదలయ్యాక ఇప్పటివరకు 14,12,959 మంది కరోనా బారిన పడగా 22,831 మంది మరణించారు. ఏప్రిల్ నుంచి మొదలైన సెకండ్ వేవ్ ఢిల్లీ సర్కారుకు, కేంద్రానికి మధ్య తీవ్ర వివాదాలకు కారణమైంది. ఆక్సిజన్ కోసం ఇతర సౌకర్యాల కోసం ఆప్ సర్కారు కోర్టుకు వెళ్లడం, కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తగిన సౌకర్యాలు సమకూర్చేలా ఆదేశించడం వార్తలకెక్కింది.