న్యూఢిల్లీ మే 23,
బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆయుష్మాన్ భారత్తో పాటు ఇతర ఆరోగ్య బీమా పథకాల్లో చేర్చాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ – 1897 ప్రకారం బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ (మ్యూకర్ మైకోసిస్)ను నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించాలని, ఆ కేసుల వివరాలను నివేదించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ విషయాన్ని సైతం ఆమె లేఖలో గుర్తు చేశారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన లిపోసోమల్ ఆంఫోటెరిసిన్-బీ మందు కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ వ్యాధి చికిత్సకు అవసరమయ్యే ఔషధాలను ఉత్పత్తి చేసి, సరఫరా అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. చికిత్స అవసరమైన రోగుల సంరక్షణకు ఉచిత సేవలు అందించాలని సూచించారు. ఇటీవల కరోనా రోగుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేంద్రం లెక్కల ప్రకారం.. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 8,848 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 200 మందికిపైగా ఫంగస్ బారినపడి మృతి చెందారు.