జనరిక్ దుకాణాలు సామాన్యులకు వరం లాంటివి. వీటిని ప్రజలకు దగ్గరకు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఈ దుకాణాల్లో మందులు తక్కువ ధరకు లభిస్తాయన్న విషయం కూడా చాలా మందికి తెలియని పరిస్థితి. వైద్యులు రోగులకు కేవలం మూలకం మందులపేర్లు మాత్రమే రాయాలి. కంపెనీల పేర్లు, బ్రాండ్ పేర్లను రాయకూడదని భారతీయ వైద్య విధాన మండలి ఆదేశించింది. ఇదే తరహాలో సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులిచ్చింది. అయితే పలు ప్రయివేటు ఆస్పత్రుల్లో ఇది అమలు కావడం లేదు. బ్రాండెడ్ మందు రూ.10కి లభిస్తే అదే జనరిక్లో రూ.5 కే వస్తుంది. జనరిక్ అయినా, బ్రాండెడ్ అయినా ఉండే మందు ఒక్కటే. వాటి పరిమాణం, పనిచేసే తీరు, నాణ్యతలో ఎటువంటి తేడా ఉండదు. జనరిక్ మందులను ప్రముఖ కంపెనీలు కూడా తయారు చేస్తాయి.కీళ్ల నొప్పులకు వాడే ట్రమడాల్ పది మాత్రల ధర ప్రయివేటు మందుల షాపుల్లో రూ.54. అదే జనతా దుకాణాల్లో అయితే రూ.10 మాత్రమే. గ్యాస్ట్రబుల్కు వాడే ప్యాంటాప్రొజోల్ పది మాత్రలు బయట కొంటే రూ.42. అదే జనరిక్ అయితే రూ.12. జనరిక్ మందులు అతితక్కువ ధరకే లభిస్తున్నా.. వాటిపై సరైన ప్రచారం లేదు. అందుబాటులో ఉండవు. ఫలితంగా రోగులు మందు బిళ్లల కోసం జేబులు గుళ్ల చేసుకుంటున్నారు. జిల్లాలో వివిధ కారణాల రీత్యా రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మందులు అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం జనరిక్ దుకాణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినా.. అవి జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించలేదు. ప్రస్తుతం డిఆర్డిఎ- వెలుగు ఆధ్వర్యంలో అనంతపురంలో రెండు, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కొత్తచెరువు, పెనుకొండ, ఉరవకొండ, రాయదుర్గం, మడకశిర, గోరంట్లలో ఒక్కొక్కటి ఉన్నాయి. త్వరలో నార్పలలో ఓ దుకాణం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక మెప్మా ఆధ్వర్యంలో తాడిపత్రి, కళ్యాణదుర్గంలో దుకాణాల ఏర్పాటు ప్రక్రియ ప్రతిపాదనల్లోనే ఉంది. 20 ఫార్మా కంపెనీలు బ్రాండెడ్తో పాటు జనరిక్ మందులూ తయారు చేస్తున్నాయి. జనరిక్ కంపెనీలు ప్రమాణాలకు కట్టుబడి ముడి రసాయనాలతోనే మందులను తయారు చేస్తాయి. భారత ప్రభుత్వం ఆధీనంలోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్స్ అనుమతితోనే ఉత్పత్తి చేస్తాయి. మార్కెటింగ్ ఖర్చులు లేకపోవడం వల్ల వాటిని తక్కువ ధరకే విక్రయిస్తాయి. సుమారు 75 శాతం వ్యాధులకు 400లకు పైగా రకాల జనరిక్ మందులు ఉన్నా ప్రజలకు మాత్రం అవి చేరువ కావడంలేదు. 20 నుంచి 25 శాతం మాత్రమే జనరిక్ మందులు విక్రయాలు జరుగుతున్నాయి.