న్యూఢిల్లీ మే 24
దేశంలో కరోనా మరణ మృందం మోగిస్తున్నది. గడిచిన కొద్ది రోజులు కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నా.. మరణాల సంఖ్య మాత్రం తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నది. తాజాగా దేశంలో 2.22లక్షల కొవిడ్ కేసులు నమోదవగా.. మరోసారి మరణాలు 4వేలు దాటాయి. కొత్తగా నమోదైన మరణాలతో దేశంలో కరోనా మరణాలు మూడులక్షల మార్క్ను దాటాయి. కరోనా మరణాల్లో భారత్ ప్రపంచంలో మూడోస్థానంలో కొనసాగున్నది. అమెరికా, బ్రెజిల్ తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి.దేశంలో గడిచిన 24 గంటల్లో 2,22,315 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ సోమవారం తెలిపింది. మరో వైపు రోజువారీ కేసుల కంటే భారీగానే బాధితులు వైరస్ నుంచి కోలుకుంటున్నారు. నిన్న 3,02,544 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారని మంత్రిత్వశాఖ పేర్కొంది. 24 గంటల్లో మరో 4,454 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,67,52,447కు పెరిగింది. ఇప్పటి వరకు 2,37,28,011 మంది బాధితులు కోలుకున్నారు.వైరస్ బారినపడి మొత్తం 3,03,720 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 27,20,716 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 88.30శాతం, మరణాలు రేటు 1.13శాతం ఉందని మంత్రిత్వశాఖ చెప్పింది. టీకా డ్రైవ్లో ఇప్పటి వరకు 19,60,51,962 డోసులు వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు దేశవ్యాప్తంగా 19,28,127 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిప్పింది. ఇప్పటి వరకు 33,05,36,064 శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది.