విజయవాడ, మే 25,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు, బీజేపీ నేతలకు మధ్య దూరం పెరిగినట్లే కన్పిస్తుంది. ఇటీవల జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక వారి మధ్య మరింత దూరం పెంచింది. జనసేనపై ఎన్నో ఆశలుపెట్టుకున్న బీజేపీకి తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు షాక్ ఇచ్చాయనే చెప్పాలి. జనసేన ఓటు బ్యాంకు తమకు షిఫ్ట్ కాలేదన్న ఆగ్రహం బీజేపీ నేతల్లో ఉంది. టీడీపీకే ఆ ఓట్లు పడటంతో భవిష్యత్ రాజకీయం ఎలా నడపాలన్న దానిపై ఇటీవల సీనియర్ నేతలు మంతనాలు జరిపినట్లు తెలిసింది.జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లక్షలాది మంది అభిమానులున్నారు. అది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. అయితే వరసగా జరిగిన ఎన్నికల్లో జనసేన కొన్ని ప్రాంతాలకే పరిమితమయింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు తప్పించి జనసేన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. జనసేన అధినేత తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారం చేసినా ఫలితాలు చూసి బీజేపీ నేతలే అవాక్కవ్వాల్సి వచ్చిం ది. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అభిమానులు ఓట్లతో పాటు కాపు సామాజికవర్గం ఓట్లు కూడా అండగా ఉంటాయని బీజేపీ భ్రమించింది. కేవలం రెండు జిల్లాలకే పరిమితమయిన పవన్ కల్యాణ్ కు అనవసర ప్రాధాన్యమిచ్చమేమోనన్న అనుమానం బీజేపీ నేతల్లో బయలుదేరింది. బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా ఓట్లు తమ వైపు టర్న్ కాకపోవడంతో బీజేపీ అగ్రనేతలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.దీంతో కేంద్రనాయకత్వం జనసేనను బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను మరోసారి తెరపైకి తేనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల సమయంలోనే బీజేపీ ఈ ప్రతిపాదన తెచ్చినా పవన్ కల్యాణ్ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే వరస ఓటములతో పవన్ కల్యాణ్ సయితం పార్టీని నడపేది ఎలా? అన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నారు. బీజేపీలో విలీనం చేస్తే అసలుకే ముప్పు ఏర్పడుతుందని సన్నిహితులు సలహా ఇస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే గౌరవప్రదమైన స్థానాలు సాధించగలమని చెబుతున్నారు. మొత్తం మీద బీజేపీకి, పవన్ కల్యాణ్ కు మధ్య దూరం పెరిగిన మాట వాస్తవం.
పీకల్లోతు కష్టాల్లో కమలం
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఇక భవిష్యత్ లో ఆ పార్టీవైపు ఎవరూ చూసే అవకాశాలు కూడా కన్పించడం లేదు. మొన్నటి వరకూ చేరికలు ఉంటాయని బీరాలు పలికిన బీజేపీ నేతలు ఇప్పుడు ఆ విషయంలో మౌనంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల వరకూ బీజేపీ లో ఎవరూ చేరే అవకాశాలు లేవని, వీలయితే జనసేనలో చేరికలు ఉండే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలు అంతంత మాత్రమే. టీడీపీతో పొత్తు పెట్టుకుని కొన్ని చోట్ల గెలిచిన సందర్భాలు ఉన్నాయి. గత ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ బీజేపీలో కొంత ఊపు కన్పించింది. వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు బీజేపీలో చేరారు. కేంద్రంలో అధికారంలోకి రావడంతోనే బీజేపీలో అప్పట్లో చేరికలు జరిగాయి.అయితే ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర ప్రభుత్వంపై కూడా అసంతృప్తి పెరిగింది. మోదీ ఇమేజ్ కూడా తగ్గింది. ఈ పరిస్థితుల్లో కమలం పార్టీలో చేరడం కట్టే రాజకీయ సన్యాసం స్వీకరించడమే బెటర్ అన్న అభిప్రాయం ఉంది. జనసేనతో జట్టుకట్టినా పెద్దగా ఫలితాలు సాధించలేదు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతో పాటు తిరుపతి ఉప ఎన్నికల్లోనూ దారుణ ఓటమి చవి చూడటంతో ఆ పార్టీకి ఓటు బ్యాంకు లేదన్న విషయం స్పష్టమయింది.
ఇక సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత చేరికలు పూర్తిగా నిలిచిపోయాయి. సోము వీర్రాజు వైఖరే ఇందుకు కారణమన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. అయితే మొన్నటి వరకూ బీజేపీ వైపు చూసిన నేతలు ఇప్పుడు జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలోని కొందరు టీడీపీ నేతలు జనసేనలో కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. దీన్నిబట్టి బీజేపీకి ఇక ఏపీలో నూకలు చెల్లినట్లే అని చెప్పుకోవాలి.