YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సిక్కోలులో కోలేకోనేది ఎప్పుడు

సిక్కోలులో కోలేకోనేది ఎప్పుడు

శ్రీకాకుళం, మే 26 
ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీకి గ‌ట్టి ప‌ట్టున్న జిల్లాల్లో ఉత్తరాంధ్ర‌లోని శ్రీకాకుళం ఒక‌టి. రాష్ట్ర విభ‌జ‌నకు ముందు.. తర్వాత కూడా పార్టీకి గ‌ట్టి ప‌ట్టున్న జిల్లాగా గుర్తింపు పొందిన ఈ జిల్లాలో గ‌త 2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి గ‌ట్టి ఎదురు దెబ్బత‌గిలింది. ఇచ్చాపురం, టెక్కలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజ‌క వ‌ర్గం మిన‌హా.. అన్ని చోట్లా పార్టీ చ‌తికిలప‌డింది. పార్టీ కంచుకోట‌లు కూలిపోయాయి. ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు స‌మంజ‌స‌మే అనుకున్నా.. త‌ర్వాత అయినా.. పార్టీ పుంజుకునేందుకు ప్రయ‌త్నించాలి క‌దా..! కానీ, టీడీపీలో ఆ త‌ర‌హా వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేదు. ఎవ‌రికి వారుగా రాజ‌కీయాలు చేసుకుంటున్నా రు. ఎవ‌రికివారు.. అంత‌ర్గత పోరుతో స‌త‌మ‌తం అవుతున్న పరిస్థితి క‌ళ్లకు క‌డుతోంది.నిజానికి జిల్లాలో పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నప్పటికీ.. టీడీపీకి ప్రయోజ‌నం లేకుండా పోయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో యువ నేత‌లు ఎక్కువ‌గా ఉన్నప్పటికీ.. వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇక‌, సీనియ‌ర్లు కూడా స‌ఖ్యత‌లేని రాజ‌కీయాలు చేస్తున్నార‌నే వాద‌న కూడా ఉంది. రాజాం, ప‌లాస‌, న‌ర‌స‌న్నపేట‌, శ్రీకాకుళం వంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు పార్టీకి ద‌శాబ్దాలుగా కంచుకోట‌లు అయినా ఇప్పుడు ఇక్కడ పార్టీని న‌డిపించే నాథుడు లేక ఇవి కూలిపోతోన్న ప‌రిస్థితి.ప‌లాస‌లో గౌతు శిరీష క్రియాశీల‌కంగా లేరు. ఆమె ఎక్కువుగా వైజాగ్‌లో ఉండ‌డంతో ప‌లాస టీడీపీ కేడ‌ర్ నిరాశ‌లో ఉంది. మంత్రి అప్పల‌రాజు ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఇక్కడ వైసీపీకి బ్రేకులు వేయాలంటే శిరీష స్థానికంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక రాజాంలో మాజీ మంత్రి కోండ్రు ముర‌ళీ గ‌త రెండు ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఓడిపోవ‌డంతో నైరాశ్యంలో ఉన్నారు. తాను ఎంత క‌ష్టప‌డినా క‌ళా వెంక‌ట్రావు వ‌ర్గం దెబ్బ కొడుతుంద‌ని ఆయ‌న రాజ‌కీయం చేయ‌డ‌మే మానుకుంటోన్న ప‌రిస్థితి.శ్రీకాకుళంలో టీడీపీ పుట్టిన‌ప్పటి నుంచి పార్టీనే అంటి పెట్టుకుని ఉన్న గుండ ల‌క్ష్మీదేవితో పాటు ఆమె భ‌ర్త మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయ‌ణ వ‌యోః భారంతో రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. ఇక ఈ ఫ్యామిలీ శ‌కం ముగిసిన‌ట్టే..! ఇక ఎచ్చెర్లలో మాజీ మంత్రి, మాజీ ఏపీ టీడీపీ అధ్యక్షుడు క‌ళా వెంక‌ట్రావు వార‌సుడిని ప్రమోట్ చేస్తుంటే టీడీపీ కేడ‌ర్ అంగీక‌రించ‌డం లేదు. ఏదేమైనా ఏపీ టీడీపీ అధ్యక్షుడు సొంత జిల్లాలో పార్టీ ప‌రిస్థితి ఇలా ఉండ‌డం దారుణ స్థితికి అద్దం ప‌డుతోంది.

Related Posts