హైదరాబాద్ మే 26
గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్ర్ట ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి ప్రగతి కోసం బౌద్ధం చూపిన బాట నేటికీ ఆచరణీయమన్నారు. తెలంగాణ సమాజపు మానవత్వ పరిమళాలు, శాంతి సహనంతో కూడిన అహింసాయుత జీవన విధానం.. వీటిలోని మూలాలు బౌద్ధ వారసత్వం నుంచే అలవడ్డాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఫణిగిరి వంటి బౌద్ధారామాల్లో బయల్పడుతున్న అరుదైన బౌద్ధ చారిత్రక సంపద.. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాలను అల్లుకొని తెలంగాణలో బౌద్ధం పరిఢవిల్లిందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని సీఎం తెలిపారు. నాగార్జున సాగర్లో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధ కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. రాష్ర్టంలోని బౌద్ధ వారసత్వ కేంద్రాలను పునరుజ్జీవింపచేసి ప్రపంచ బౌద్ధ పటంలో తెలంగాణకు సముచిత స్థానాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, ప్రగతి కోసం పాటుపడటమే భగవాన్ గౌతమ బుద్ధునికి నిజమైన నివాళి. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ముందుకు సాగుతోందని అని సీఎం పేర్కొన్నారు.