న్యూఢిల్లీ మే 26
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. మరోసారి మూడు లక్షలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, మరణాలు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. వరుసగా రెండో రోజు నాలుగువేలకుపైగా మరణాలు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,08,921 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కొత్తగా 2,95,955 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా.. 4,157 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,71,57,795కు పెరిగాయని, ఇప్పటి వరకు 2,43,50,816 మంది కోలుకున్నారు.వైరస్ బారినపడి మొత్తం 3,11,388 మంది కన్నుమూశారు. ప్రస్తుతం దేశంలో 24,95,591 యాక్టివ్ కేసులున్నాయి. మరో వైపు టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు 20,06,62,456 కోట్ల డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. దేశంలో రికవరీ రేటు పెరుగుతోంది, ప్రస్తుతం 89.66శాతంగా ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు రికార్డు స్థాయిలో 22,17,320 కొవిడ్ టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటి వరకు 33,48,11,496 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.