న్యూఢిల్లీ మే 26
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్గా ఇవాళ ఐపీఎస్ సుబోధ్ కుమార్ జైస్వాల్ బాధ్యతలు స్వీకరించారు. సీబీఐ డైరక్టర్గా ఆయన రెండేళ్ల పాటు తన విధులు నిర్వర్తించనున్నారు. మహారాష్ట్ర క్యాడర్, 1985 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన జైస్వాల్ ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. గతంలో మహారాష్ట్ర డీజీపీగా పనిచేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరితో కూడిన సీబీఐ డెరెక్టర్ ఎంపిక కమిటీ సోమవారం సమావేశమై చర్చించిన సంగతి తెలిసిందే. సీబీఐ డైరెక్టర్గా రెండేండ్ల పాటు పనిచేసిన రిషి కుమార్ శుక్లా ఫిబ్రవరి 3న పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి మూడు నెలలుగా సీబీఐకి పూర్తిస్థాయి డైరెక్టర్ లేరు. అదనపు డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా తాత్కాలిక డైరెక్టర్గా కొనసాగుతున్నారు.
జూన్ 2018 నుంచి ఫిబ్రవరి 2019 వరకు ముంబై పోలీసు కమీషనర్గా జైస్వాల్ చేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర డీజీపీ అయ్యారు. తెల్గీ స్కామ్ను సీబీఐ తీసుకోకముందే.. జైస్వాల్ ఆ కేసును విచారించారు. ఆ రాష్ట్ర రిజర్వ్ పోలీసు ఫోర్స్ అధిపతిగా కూడా చేశారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్లోనూ విధులు నిర్వర్తించారు. ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు రా వింగ్లోనూ చేశారు. సీబీఐ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన సుబోధ్.. ముంబై మాజీ పోలీసు కమీషనర్ పరంబీర్ సింగ్ చేసిన వంద కోట్ల వసూళ్ల ఆరోపణల కేసును దర్యాప్తు చేపట్టనున్నారు.