హైదరాబాద్, మే 26,
తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కాషాయ పార్టీలో చేరే అంశంపై స్వయంగా ఈటల స్పందించారు. తానే బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ టీవీ ఛానెల్తో మాట్లాడారు. బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. తనకు మద్దతు కోరేందుకే బీజేపీ నేతల్ని కలిశానని స్పష్టత ఇచ్చారు. రాజీనామా అంశంపై మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ హుజురాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపారు. త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. తాను ఎప్పటికీ స్వతంత్రంగానే ఉంటానని, ఎవరితోనూ కలవబోనని ఈటల స్పష్టం చేశారుఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారని తొలి నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన బీజేపీలో చేరుతున్నారని, సోమ, మంగళవారాల్లో జరిగిన పరిణామాలు అందుకు మరింత బలం చేకూర్చాయి. ఈ రెండ్రోజుల్లో ఆయన బీజేపీ ముఖ్య నేతల్ని కలిశారు. సోమవారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చారు. అదే రాత్రి ఈటల రాజేందర్ మాజీ ఎంపీ వివేక్ ఫాంహౌస్లో కిషన్రెడ్డితో కలిసి మాట్లాడారని ఊహాగానాలు వచ్చాయి. అయితే, తాను అసలు ఈటలను ప్రత్యక్షంగా కలవలేదని కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తనను ఫోన్లో మాత్రమే కలిశానని తెలిపారు.