హైద్రాబాద్, మే 27,
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరించింది. ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నెలలుగా లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. ప్రజలు తప్పనిసరిగా ముఖాలకు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ఆదేశాలు జారీచేశాయి. సబ్బు లేదా హ్యాండ్ శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించాయి. దీంతో ప్రపంచంలో ఎక్కడ చూసినా హ్యాండ్ శానిటైజర్ ఒక నిత్యావసరంగా మారిపోయింది. ప్రతి ఇంట్లో, దుకాణాల్లో, కార్యాలయాల్లో, ఆఖరికి వాహనాల్లో సైతం హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచుకుంటున్నారు. అయితే ఈ హ్యాండ్ శానిటైజర్లతో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని అగ్నిమాపక శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పొరపాటున కూడా సూర్యరశ్మి, వేడి అధికంగా ఉండే ప్రదేశాల్లో హ్యాండ్ శానిటైజర్లను పెట్టకూడదని వారు సూచిస్తున్నారు. ఆల్కహాల్తో తయారయ్యే ఈ హ్యాండ్ శానిటైజర్లకు సహజంగానే మండే స్వభావం ఉంటుందని.. కార్లు, ఇతర వాహనాల్లో శానిటైజర్లను వదిలి వెళ్లడం ప్రమాదకరమని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. వాహనం ఎక్కువ సేపు ఎండలో ఉంటే బాగా వేడక్కెతుందని, అలాంటప్పుడు అందులో హ్యాండ్ శానిటైజర్ ఉంటే వేడికి మండిపోయి వాహనం మొత్తం తగులబడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.