YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఎయిమ్స్ లో ఆర్ ఆర్ ఆర్

ఎయిమ్స్ లో ఆర్ ఆర్ ఆర్

న్యూఢిల్లీ, మే  27, 
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈ రోజు ఎయిమ్స్‌లో చేరారు. కాలిగాయాలు తగ్గకపోవడంతో ఆయన ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. వీల్‌చైర్‌లో ఆస్పత్రికి వెళ్లిన ఆయన బీపీ హెచ్చుతగ్గులు, తీవ్రమైన కాళ్లనొప్పులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.ఎయిమ్స్‌లో చేరిన రఘురామకు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఫోన్ చేసి పరామర్శించినట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి.. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కేంద్రం ఆదేశాలతో ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎంపీ రఘురామ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రఘురామకు పలు వైద్యపరీక్షలు నిర్వహించారు. అయితే కోర్టు ఆదేశాలు ఉండడంతో రఘురామ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చడం.. రాజద్రోహం కేసులో ఎంపీ రఘురామను ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈ కేసులో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. ఆయన అరెస్టు అనంతరం గుంటూరు సబ్‌జైలుకి తరలించారు. మరుసటి రోజు కోర్టులో హాజరుపరచగా పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని రఘురామ ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు జీజీహెచ్‌కి తరలించి వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. అనంతరం రమేష్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పినా వినకుండా పోలీసులు జైలుకి తరలించారు.ఘటన అనంతరం రఘురామ సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఆయన్ను వెంటనే సికింద్రాబాద్ మిలిటరీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఆధ్వర్యంలో ఆయన వైద్య పరీక్షల నివేదికలను సుప్రీకి పంపించాలని సూచించింది. అనంతరం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అప్పటి వరకూ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన.. నిన్న ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.

Related Posts