హైదరాబాద్
బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నగరంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నియంత కేసీఆర్ను గద్దె దించటానికి అందరూ కలసి రావాలని పిలుపునిచ్చారు. నియంతృత్వ పాలనను ఎదుర్కోవటానికే పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. ఈటల రాజేందర్ ఢిల్లీలో జేపీ నడ్డాను కలుస్తారని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తనతో చర్చించిన తర్వాతే ఈటల ఢిల్లీ వెళ్ళారన్నారు. ఈటల చేరికను ముఖ్యనేతలతో సహా అందరూ స్వాగతిస్తున్నారని.. పార్టీలో సానుకూల వాతావరణం ఉందన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ సహకరించాలని కోరారు. అసంతృప్తులు సహజమని, సీనియర్ నేత పెద్దిరెడ్డి అసంతృప్తిని పార్టీలో చర్చిస్తామన్నారు. అంతర్గత అంశాలు బయటకు చెప్పాల్సిన అవసరం లేదని, పెద్దిరెడ్డి తనను విమర్శించినంత మాత్రానా తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్కు మంచిని.. మోదీకి చెడును ఆపాదించటం టీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందన్నారు.