కోల్కతా మే 31
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీకి తన నిరసన గళం వినిపించారు. తమ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని కేంద్రానికి పంపించేది లేదంటూ ఆమె మోదీకి రాసిన లేఖలో స్పష్టం చేశారు. గత శుక్రవారం యాస్ తుఫానుపై మోదీతో జరిగిన సమావేశానికి మమత హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆలాపన్ బంద్యోపాధ్యాయ్ను వెంటనే ఢిల్లీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఆయన సోమవారం ఉదయం 10 గంటలలోపే అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంది.కానీ మమత మాత్రం ఆయనను రిలీజ్ చేసేది లేదని తేల్చి చెబుతూ మోదీకి లేఖ రాయడం గమనార్హం. కేంద్రం ఏకపక్షంగా ఇచ్చిన ఆదేశం తనను షాక్కు గురిచేసిందని ఆమె ఆ లేఖలో చెప్పారు. బెంగాల్ ప్రభుత్వం ఇలాంటి తీవ్ర పరిస్థితుల్లో తన చీఫ్ సెక్రటరీని రిలీజ్ చేయదు. గతంలో ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ ఇచ్చిన చట్టపరమైన ఆదేశాలు చెల్లుబాటు అవుతాయని తాము భావిస్తున్నట్లు ఆ లేఖలో మమత స్పష్టం చేశారు.బంద్యోపాధ్యాయ్ రాష్ట్రంలోనే కొనసాగుతారని, ఇక్కడి కొవిడ్ సంక్షోభ నిర్వహణను చూసుకుంటారని కూడా మమత అందులో తేల్చి చెప్పారు. ప్్ధాని సమావేశానికి సీఎం మమత హాజరుకాకపోవడంపై సీరియస్ అయిన కేంద్రం కొన్ని గంటల వ్యవధిలోనే చీఫ్ సెక్రటరీ ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు చట్టపరంగా చెల్లవని, ఇవి అసాధారణం, రాజ్యంగ విరుద్ధమని తన లేఖలో మమత అన్నారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో చీఫ్ సెక్రటరీని మరో మూడు నెలలు కొనసాగిస్తూ ఈ మధ్యే కేంద్రం ఆదేశాలు ఇవ్వడాన్ని లేఖలో మమత ప్రస్తావించారు.