475 కోట్ల నిధులతో రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కాలేజీకి సిఎం వర్చువల్ శంకుస్థాపన పేదవానికి చేరువలో మెరుగైన వైద్యం వెయ్యి రూపాయలు మించిన వైద్యం 'ఆరోగ్యశ్రీ' లోనికి..
మంత్రి చెల్లుబోయిన, ఎంపి భరత్ రామ్ రాజమహేంద్రవరం.
ఆర్ధిక భారంతో పేదవాడు మెరుగైన వైద్యం చేయించుకోలేక ప్రాణాలను సైతం కోల్పోతున్న తరుణంలో పేదవానికి చేరువలో ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందజేసేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించుకోవటం ఈ రాష్ట్ర ప్రజలందరి అదృష్టమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, రాజమహేంద్రవరం ఎంపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు.
సోమవారం రాజమహేంద్రవరం నగరంలోని సెంట్రల్ జైలు పెట్రోల్ బంకు వద్ద ప్రభుత్వ వైద్య కళాశాల శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రి చెల్లుబోయిన, ఎంపి భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ చేస్తున్న కార్యక్రమాలు ప్రశంసించదగినవని అన్నారు.
ఎంపి భరత్ రామ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం 33.17 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం జరగనుందన్నారు. మెడికల్ కళాశాల, నర్సింగ్ హాస్టల్ నిర్మాణానికి రూ.475 కోట్లు ప్రభుత్వం వ్యయం చేస్తోందన్నారు. 2023 డిసెంబర్ నెలకు ఈ నిర్మాణాలు పూర్తవుతాయని ఎంపి భరత్ రామ్ తెలిపారు. భవిష్యత్తులో రాజమహేంద్రవరం నగరంలో మెడికల్ హబ్ గా తీర్చి దిద్దే యోచనలో సీఎం జగన్ ఉన్నారని చెప్పారు. వంద కోట్ల రూపాయలు పెట్టుబడితో ఎవరు మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ముందుకు వచ్చినా వారికి 5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా అందజేసి సహకరిస్తుందని ఎంపి భరత్ రామ్ పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు రూ.10 లక్షలు ప్రకటించి ఇంటి పెద్ద అన్నగా జగన్ ఆదుకుంటున్నారని అన్నారు. రాజమహేంద్రవరం నగరానికి ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. బీసీ సంక్షేమ శాఖ మాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రభుత్వ వైద్య కళాశాలలను సుమారు రూ.8 వేల కోట్లతో నిర్మించడం సర్వసాధారణం విషయం కాదన్నారు. భవిష్యత్తులో కోవిడ్ లాంటి మహమ్మారి వ్యాధులు ఎన్ని వచ్చినా వాటిని సమూలంగా సమర్థవంతంగా నివారించేందుకు ముఖ్యమంత్రి జగనన్న వైద్య రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఒకేసారి ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ శంకుస్థాపన చేయటం శుభదినంగా మంత్రి చెల్లుబోయిన అభివర్ణించారు. తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ, రాజమహేంద్రవరంలో రెండు ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు రూ. 950 కోట్లతో నిర్మించడం గొప్ప విశేషమన్నారు. మెడికల్ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో తాము పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, సబ్ కలెక్టర్ అనుపమ అంజలి మున్సిపల్ కమిషనర్ అభిశిక్తు కిషోర్, రాజమహేంద్రవరం రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు, తదితరులు పాల్గొన్నారు.