హైదరాబాద్, జూన్ 1.,
ఈ ఏడాది కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగే సూచనలు కనిపించడం లేదు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తితో పాటు లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వమే బాధ్యతగా మెలగాల్సిన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాలను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. 2014లో తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్తోపాటు జిల్లాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఉత్తమ సేవలు అందించిన శాఖలు, అధికారులు, ఉద్యోగులకు సేవా పురస్కారాలను సైతం అందజేస్తోంది.అయితే.. గత ఏడాది కరోనా తొలిదశలో రాష్ట్రంలో తీవ్ర ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను కేవలం సంప్రదాయబద్దంగా నిర్వహించారు. కాగా.. ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ ముంచురావడంతో గత ఏడాది మాదిరే ఈ సారి కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. సీఎం ప్రగతిభవన్లో, మంత్రులు, కలెక్టర్లు జిల్లా కేంద్రాల్లో జెండాలను ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది.గత ఏడాది ఉదయం గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత ప్రగతి భవన్లో జెండా ఆవిష్కరించగా.. మధ్యాహ్నం రాజ్ భవన్లో గవర్నర్ గోశాలను ప్రారంభించి, మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విప్, విప్లు జెండాలను ఆవిష్కరించారు. ఏ జిల్లాలో ఆ జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నత ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని పూర్తిచేశారు. కాగా ఈ ఏడాది కూడా అదే విధంగా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఈ వేడుకలు పూర్తిచేయనున్నట్లు తెలుస్తుంది.