రాజన్న సిరిసిల్ల జూన్ 2
వానాకాలం పంట ఖర్చుల నిమిత్తం ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతాయని రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. సర్దార్పూర్లో మార్కెట్యార్డు పనులు, బెటాలియన్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. రైతులను ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రెండో హరిత విప్లవానికి సీఎం కేసీఆర్ నాంది పలికారు.ఎన్నడూ లేని విధంగా సిరిసిల్ల మెట్ట ప్రాంతంలో రికార్డు స్థాయిలో వరి దిగుబడి వచ్చిందన్నారు. వేసవిలో కూడా అప్పర్ మానేరు మత్తడి దుంకుతోందన్నారు. రైతుబంధు డబ్బులు జమ అయ్యేలోపు భూ సమస్యలు ఉంటే పరిష్కరించాలని కలెక్టర్, ఆర్డీవోకు సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ను చేపట్టామని తెలిపారు. ఫారెస్టు అధికారులతో సమన్వయం చేసుకుని అటవీ భూముల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల రైతులకు అధునాతన మార్కెట్యార్డును నిర్మించామని కేటీఆర్ తెలిపారు.