రూ. 12.70కోట్ల వ్యయంతో నిర్మించిన చింతలకుంట చెక్పోస్ట్ అండర్ పాస్ రేపటి నుండి నగరవాసులకు అందుబాటులో రానుంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్లతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ఈ అండర్ పాస్ను మంగళవారం ప్రారంభించనున్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం లో భాగంగా చేపట్టిన ఏల్బినగర్ చింతలకుంట అండర్పాస్ను ప్రారంభించడంతో ఎస్.ఆర్.డి.పికి చెందిన మూడో ప్రాజెక్ట్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. చింతలకుంట సాగర్ రింగ్ రోడ్ నుండి విజయవాడ వైపు వెళ్లే ట్రాఫిక్ కు ఏమాత్రం ఆటంకం లేకుండా వెళ్ళడానికి మొత్తం 540మీటర్ల పొడవునా అండర్ పాస్ నిర్మాణ పనులను జీహెచ్ ఎంసీ చేపట్టింది. చింతలకుంట చెక్ పోస్ట్ అండర్ పాస్ నిర్మాణ పనులను గడువులోగా నిర్మాణం పూర్తిచేసి నగర వాసుల వినియోగార్థం తేవడంలో జీహెచ్ఎంసీ విజయం సాధించింది. ఈ అండర్ పాస్తో చింతలకుంట జంక్షన్ లో 95శాతం ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 12మీటర్ల వెడల్పుతో 540మీటర్ల పొడవుతో ఉన్న ఈ అండర్ పాస్లో 112 మీటర్లు క్లోజ్డ్ బాక్స్ గా ఉండగా 428మీటర్లు అప్రోచ్ రోడ్లుగా నిర్మించారు. హైదరాబాద్ నగరంలో రూ.2,631 కోట్ల వ్యయంతో జంక్షన్లు, గ్రేడ్ సపరేటర్లు, ఫ్లైఓవర్లు 18ప్రాజెక్ట్ ల నిర్మాణాలుగల ఐదు ప్యాకేజీలను రాష్ట ప్రభుత్వం 2015 సెప్టెంబర్ లో పరిపాలన సంబందిత అనుమతులను జారీ చేసింది. దీనిలో ప్యాకేజీ 2కింద ఎల్బీనగర్తో పాటు పరిసర ప్రాంతాల్లో జంక్షన్ల అభివృద్ది, అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.