హైదరాబాద్ జూన్ 3
కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిపై పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు వీ హనుమంత రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రేవంత్ రెడ్డిపైనా ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారికి పీసీసీ చీఫ్ పదవి ఎలా ఇస్తారంటూ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఉందా.? లేదా.? అని ఆయన నిలదీశారు. తాను రేవంత్ రెడ్డిని తిట్టలేదని, రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయని మాత్రమే చెప్పానని అన్నారు. ఇవాళ నన్ను తిట్టారు.. రేపు ఇంకొకరిని తిడతారని పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఎక్కువయ్యారని, కోవర్టులు ఉన్నన్ని రోజులు పార్టీ బాగుపడదని మండిపడ్డారు.హైకమాండ్కు లేఖలు రాసిరాసి అలిసిపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పి చేసి ఉంటే చెప్పండి పార్టీ నుంచి తప్పుకుంటానని అన్నారు. తనకు పార్టీలో అవమానాలు ఎక్కువయ్యాయని ఆయన ఆరోపించారు. ‘‘సోనియా గాంధీ బలిదేవత అన్నవాళ్లే ఇప్పుడు ఆమెకు దగ్గరయ్యారు. సీనియర్లు, జూనియర్లు కలిస్తేనే పార్టీ. రేవంత్ పెద్ద నాయకుడు అంటారు, గ్రేటర్లో ఎన్ని సీట్లు గెలిపించాడని నిలదీశారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయితే గాంధీ భవన్కు కూడా ఎవ్వరినీ రానివ్వడు. పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్ జైలుకు వెళ్తే ఎలా.? పార్టీ జైలు చుట్టూ తిరగాలా’’.! అని ఘాటుగా విమర్శించారు.