హైదరాబాద్, జూన్ 5,
మాజీ మంత్రిఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నట్లు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ ప్రజాస్వామ్యం కోసం పోరాడే శక్తిగా మారతారని ప్రజలు భావించారని అభిప్రాయపడ్డారు. ఒక ఫోర్స్గా తయారవుతారని తెలంగాణ సమాజం ఈటల వైపు చూసిందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన పరిస్థితుల్లో ఈటల రాజేందర్ మంచి అవకాశాన్ని చేజార్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈటల తాజా నిర్ణయంతో ఆయన వెనుక ఉండి పోరాడాలనుకున్న వాళ్ళు నిమ్మకుండిపోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ మీద పోరాటం చేస్తే తాను, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కలసి వస్తామని ఈటలకు ముందే చెప్పామని గుర్తు చేశారు.బీజేపీలో చేరాలన్న ఈటల రాజేందర్ నిర్ణయం ఆయన సొంత నిర్ణయమని, ఈటల చేరిక వలన బీజేపీకి బాగా లాభమని అన్నారు. ఈటలకు వచ్చేదేమీ ఉండబోదని చెప్పారు. ఈటల తీసుకునే నిర్ణయం అందర్నీ కలుపుకుపోయేలా ఉంటోందని భావించామని, బీజేపీలో చేరవదద్దని ఈటలకు ఎప్పుడూ చెప్పలేదని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వంపై పోరాటం చేయడంలో ప్రతిపక్షాలు విఫలమైన మాట వాస్తవమేనని అన్నారు.