ఇకపై పెపర్లెస్ అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ... కమిషనరేట్ పరిధిలో ఇ-ఆఫీస్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. నగరవాసులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు సీపీ అంజనీకుమార్.. కొత్త సాఫ్ట్వేర్పై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామని... 2వేలమందికి ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లు చెప్పారు. ఈ విధానం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని... పోలీసులు-ప్రజల మధ్య సత్సంబంధాలు కూడా మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇ-ఆఫీస్ ద్వారా ఫైల్స్కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ చేయొచ్చన్నారు అంజనీకుమార్. బాధితుడి ఫిర్యాదు ఇచ్చిన దగ్గర నుంచి ఆ కేసు క్లియరెన్స్ వరకు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ఒకవేళ ఫైల్ పెండింగ్లో ఉంటే... అది ఎక్కడ ఆగిపోయింది... కారణమేంటి... ఎప్పటిలోపు క్లియర్ అవుతుంది లాంటి సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చని సీపీ చెబుతున్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని ఫైళ్లను... డిజిటలైజ్ చేస్తున్నట్లు చెప్పారు. కొత్త విధానాన్ని అమలు చేస్తున్నప్పుడు... చిన్న, చిన్న ఇబ్బందులు రావడం సహజమని... తర్వాత అన్నీ సర్థుకుంటాయన్నారు అంజనీకుమార్. అధికారిక వ్యవహారాలన్నీ పేపర్ల మీదే సాగుతున్నాయి. ఓ బాధితుడు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత అది కేసుగా మారడానికి, ఆపై దర్యాప్తు జరగడానికి, చార్జ్షీట్ దాఖలు కావడానికి ఆ ఫైల్ ఎందరో సిబ్బంది, అధికారుల వద్దకు అనుమతుల కోసం వెళ్తుంటుంది. ప్రస్తుతం ఇది ఫైళ్ల రూపంలోనే జరుగుతుండటంతో ఎవరి వద్ద పెండింగ్లో ఉంది? ఎన్ని రోజులు ఆగింది? తదితర అంశాలు గుర్తించడం కష్టం. ఏదిఏమైనా జవాబుదారీతనం కొరవడిన కారణంగా కొన్ని సందర్భాల్లో ఫిర్యాదుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ రకాలైన అనుమతులు కోరుతూ సమర్పించిన దరఖాస్తులకు సంబంధించిన ఫైళ్ల విషయంలోనే అనేకసార్లు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ అంజినీకుమార్ ఈ–ఆఫీస్ను అమలు చేయాలని నిర్ణయించారు. పేపర్ లెస్ విధానంలో ఫైళ్లన్నీ డిజిటల్ రూపంలోకి మారిపోతాయి. అనుమతులకు సంబంధించి ఠాణాలు, డివిజన్లు, జోనల్ అధికారులకు వచ్చిన దరఖాస్తులకూ ఇదే వర్తిస్తుంది. ఈ ఇంట్రానెట్కు సంబంధించి ప్రత్యేకంగా డ్యాష్బోర్డ్ ఏర్పాటు చేస్తున్నారు. దీని కారణంగా ప్రతి ఉన్నతాధికారి ఓ ఫైల్/పిటిషన్ ఎక్కడ ఉంది? దర్యాప్తు ఏ స్థాయికి చేరింది? జాప్యం ఎక్కడ జరుగుతోంది? అనే అంశాలను మానిటర్ చేయవచ్చు.