జగిత్యాల జూన్ 8
రెవెన్యూ శాఖలో పెండింగ్ లో ఉన్న పలు సమస్యలు పరిష్కరించుటకు చొరవ చూపాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ను హైద్రాబాద్ లో కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎం.డీ.వకీల్ ,గౌరవ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తెలిపారు. వారు విలేకరులతో మాట్లాడుతూ వివిధ క్యాడర్లలో పెండింగ్ లో ఉన్న పదోన్నతులు, బదిలీలు, అన్ని క్యాడర్ల సమస్యలు, కొత్త జిల్లాలు /డివిజన్లు /మండలాల్లో క్యాడర్ స్ట్రెంత్ ఏర్పాటు ఉద్యోగులకు నెల నెల వేతనాలు,కోవిడ్ అత్యవసర సమయంలో రెవెన్యూ సేవలు,ధరణి సమస్యల పరిష్కారం, ధాన్యం కొనుగోలు వంటి సేవలలో రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడిని తగ్గించుటకు తగు చర్యలు చేపట్టాలని, ఆయా క్యాడర్లలో ఖాళీల భర్తీ చేపట్టాలని ట్రెసా విజ్ఞప్తి చేసిందన్నారు.. దీనికి మంత్రి స్పందించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సత్వరం తీసుకెళ్లి రెవెన్యూలో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. ఉద్యోగులందరికీ పిఆర్సి అమలు జీఓ వెలువడుతుందని జూన్ నెల జీతం పీఆర్సీ తో కలిపి తీసుకోవచ్చని ఆ దిశగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారని వారు చెప్పారు.మంత్రి కల్సిన వారిలో ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, కార్యదర్శులు నిరంజన్ రావు, బాణాల రాంరెడ్డి, మాధవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.