YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జనాభా ప్రాతిపదికన వ్యాక్సినేషన్ గైడ్ లైన్స్ రీలీజ్ చేసిన కేంద్రం

జనాభా ప్రాతిపదికన వ్యాక్సినేషన్ గైడ్ లైన్స్ రీలీజ్ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ, జూన్ 8, 
వ్యాక్సినేషన్ ప్రక్రియను పునఃపరిశీలించిన కేంద్రం.. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా ఉచితంగానే అందజేయనుంది. జూన్ 21 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించి తాజాగా మంగళవారం నూతన జాతీయ విధానాన్ని ప్రకటించింది. జనాభా, వ్యాధి తీవ్రత, కేసుల ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు టీకాలను కేటాయించనున్నట్లు స్పష్టం చేసింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, వ్యాక్సినేషన్‌ సమర్థంగా చేపడుతున్న రాష్ట్రాలకు కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది.అయితే, టీకాల వృథా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు మాత్రం కోత విధించనున్నట్టు హెచ్చరించింది. టీకా లభ్యత సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేయాలని సూచించింది. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 75శాతం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. వీటిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాధాన్యత ఆధారంగా ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాల ద్వారా ప్రజలకు అందజేయాలి.పంపిణీ ప్రాధాన్యత క్రమం. 1. ఆరోగ్య కార్యకర్తలు 2. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు 3. 45ఏళ్లు పైబడిన పౌరులు 4. రెండో డోసు వేయించుకోవాల్సిన వారు 5.18ఏళ్ల పైబడినవారు. 18 ఏళ్లు నిండిన వారికి ప్రాధాన్యత క్రమాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే సొంతంగా నిర్ణయించుకుని టీకా పంపిణీ చేపట్టాలి.టీకా డోస్‌లను రాష్ట్రాల్లోని జనాభా, కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్‌లో వృద్ధి వంటి అంశాలను ప్రాతిపదకను పరిగణనలోకి తీసుకుని కేటాయిస్తాం. రాష్ట్రాల్లోని టీకా వృథా.. కేటాయింపులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.డోసుల గురించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ముందస్తు సమాచారం ఇస్తాం. ఇదే విధంగా రాష్ట్రాలు కూడా ఆయా జిల్లాలు, వ్యాక్సిన్‌ కేంద్రాలకు ముందుగానే డోసుల వివరాలు పంపాలి. ప్రజలకు కూడా తెలియజేయాలి.వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచేందుకు టీకా తయారీదారులు తమ ఉత్పత్తిలో 25శాతం నేరుగా ప్రైవేటు ఆసుపత్రులకు విక్రయించుకునే వీలు కల్పించాం. ప్రైవేటు ఆసుపత్రులకు అందజేసే డోసుల ధరలను సదరు సంస్థలు ముందుగానే నిర్ణయించి, ఛార్జీలను కూడా వెల్లడించాలి. అలాగే, ప్రైవేటు ఆసుపత్రులు వ్యాక్సిన్‌ ధరపై సర్వీసు ఫీజు గరిష్ఠంగా రూ.150 మాత్రమే వసూలుచేయాలి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిశీలించాలి.కొవిన్‌ నమోదుతో పాటు వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచాలి. కాల్‌ సెంటర్లు, కామన్‌ సర్వీసు సెంటర్ల ద్వారా టీకా ముందస్తు బుకింగ్‌ చేసుకునే సదుపాయాన్ని ప్రజలకు కల్పించాలి.కేంద్రం సరఫరా చేసిన టీకాల్లో అత్యధికంగా ఝార్ఖండ్‌లో 37 శాతం, చత్తీస్‌గఢ్‌లో 30 శాతం, మధ్యప్రదేశ్‌లో 11 శాతం వృథా అయినట్టు గత నెలలో కేంద్రం వెల్లడించింది. అయితే, దీనిని మూడు రాష్ట్రాలు తీవ్రంగా ఖండించాయి. దాదాపు 5 శాతం మాత్రమే వృథా అయినట్టు తెలిపాయి. దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్-వీ ఈ మూడు టీకాలే వినియోగంలోకి వచ్చాయి.

Related Posts