సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కలియుగ ప్రత్యక్ష దైవంతిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆయన ఆలయానికి విచ్చేసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ మహాద్వారం వద్ద జస్టిస్ రమణకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకకులు వేణుగోపాల దీక్షితులు, ఇతర అర్చకస్వాములు ఆయనకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారి ఆశీస్సులతోనే ఈ స్థాయికి చేరుకున్నానని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆయన వెంట తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలక మండలి సభ్యులు డాక్టర్ నిశ్చిత, శివకుమార్, డీపీ అనంత , పార్థసారధి రెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి ఉన్నారు.
తిరుమల పర్యటన ముగించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాదు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ స్వాగతం పలికారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు, అధికారులు కూడా ఎయిర్ పోర్టులో జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ రాజ్ భవన్ అతిథి గృహానికి బయల్దేరారు. ఆయన రాజ్ భవన్ అతిథి గృహంలో మూడ్రోజుల పాటు గడపనున్నారు. కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్ భవన్ వద్ద స్వాగతం పలికారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు తరలివచ్చి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ను కలిశారు.