హైద్రాబాద్, జూన్ 13,
పీసీసీ అధ్యక్షుడి నియమాకం మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. దీంతో అతి త్వరలో టీపీసీసీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ పార్టీలోని వివాదాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటైన కమిటీ ఒక ఫార్ములాను రూపొందించిందని, దీన్ని అమలు చేసిన వెంటనే తెలంగాణపై దృష్టి సారించే అవకాశం ఉందని ఢిల్లీలో పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు.ఈ క్రమంలో రేవంత్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్గా మారింది. టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న రేవంత్రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. దీనిపై మరోసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఢిల్లీ వెళ్లిన రేవంత్ ఎవరెవరితో భేటీ కానున్నారా ? ఏయే అంశాలపై చర్చించనున్నారు ? అనేది ఆసక్తికరంగా మారింది. టీపీసీసీ చీఫ్ ప్రకటన నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ పర్యటనపై తెలంగాణ రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు.